రవీంద్రభారతి,డిసెంబర్13 : కళలు, కళాకారులు, ఆట, పాటలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ప్రాచీన కళలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కళాకారులపై ఉందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సీల్వెల్ కార్పొరేషన్, శృతి లయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ మల్లు రవికి మహాత్మాగాంధీ స్ఫూర్తి పురస్కారం బహూకరణ కార్యక్రమం రవీంద్రభారతిలోని మెయిన్హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రాచీన కళలు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తాయని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి విష వలయం నుంచి భవిష్యత్ తరాలను తప్పించి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు.
ఆ దిశగా తమ ప్రభుత్వం కళలను, కళాకారులకు చేయూతనిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీల్వెల్ కార్పొరేషన్ సీఎండి బండారు సుబ్బారావు, శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ బొక్క భీంరెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవజ్ఞశర్మ, మహ్మద్ రఫీ, కుసుమ భోగరాజు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు నవరస గాయని ఆమని బృందంచే సీల్వెల్ సినీ సుస్వురాలు -52 కార్యక్రమం వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది.