హైదరాబాద్ : కాప్రా పరిధిలోని జవహర్ నగర్లో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ మహర్షి విద్యానికేతన్ తన ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. 2001లో స్థాపించబడిన ఈ పాఠశాల, 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సిల్వర్ జూబ్లీ’ (రజతోత్సవ) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఫిబ్రవరి 6, శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు కీసర సమీపంలోని చీర్యాల ‘పీఐ గార్డెన్స్’లో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భారత స్టార్ అథ్లెట్, ఆసియా ఛాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్ నందిని అగాసర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇటీవల సౌత్ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆమె, విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు.
మరోవైపు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఎస్.హెచ్.ఓ ఎస్. సైదయ్య, కీసర ఎస్.హెచ్.ఓ ఏ. ఆంజనేయులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు సీనియర్ పరిశోధకులు డాక్టర్ పి. ఆంజనేయులు, మెడికల్ ఇన్ఫో మేనేజర్ డాక్టర్ ఎన్. రమణ చారి, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎల్. యాదయ్య తదితర విద్యా, వైద్య రంగాల ప్రముఖులు విచ్చేశారు. స్పెషల్ ఇన్వైటీలుగా నేతాజీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఛైర్మన్ కె. నిరంజన్ రెడ్డి, కేవీఎన్ ప్రిన్సిపల్ ఎ. మాధురి హాజరయ్యారు. రజతోత్సవాల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారతీయ సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో వేదిక ప్రాంగణం మార్మోగిపోయింది. గత 25 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ, భావి తరాలను తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యాన్ని అతిథులు అభినందించారు.
పాఠశాల కరస్పాండెంట్ జి. ఎన్. చారి, ప్రిన్సిపల్ జి. లలిత, మరియు ఈవెంట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎస్. రాజశేఖర్ ఈ వేడుకలను పర్యవేక్షించగా.. సుదీర్ఘ కాలంగా విద్యా ప్రమాణాలను పాటిస్తూ ఒక గొప్ప వారసత్వాన్ని నిర్మిస్తున్నందుకు తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.