Hyderabad | న్యూఇయర్ సందర్బంగా హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన సన్బర్న్ ఈవెంట్పై దుమారం చెలరేగుతోంది. ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను విక్రయించినందుకు గానూ బుక్ మై షోపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బుక్ మై షోతో పాటు సన్బర్న్ షో నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు.
అనుమతులు ఇవ్వకపోయినా సన్బర్న్ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను బుక్మైషోలో విక్రయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో షో నిర్వాహకులు, బుక్ మై షో ప్రతినిధులను పిలుచుకుని పోలీసు ఉన్నతాధికారులు మందలించారు. ఈ క్రమంలోనే వారిపై కేసులు నమోదు చేశారు. కాగా, నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. అనుమతి తీసుకున్న తర్వాతే టికెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు. సన్ బర్న్ ఈవెంట్పై కూడా సీపీ అవినాశ్ మహంతి స్పందించారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్బర్న్ లాంటి వేడుక కాదని.. అందుకే అనుమతి నిరాకరించామని తెలిపారు.