దవాఖానలో ప్రత్యేక విభాగం.. ఉన్నతాధికారులకు చేరిన డీపీఆర్
అనుమతి రాగానే నిర్మాణ పనులు ప్రారంభం
సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో కాలేయ (లివర్) మార్పిడి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరమైంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లో మాత్రమే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతుండగా, గాంధీలో కూడా నిర్వహించేందుకు విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం కిందనే ఈ కాలేయ మార్పిడి చేస్తున్నారు. దీంతో సాధారణ కాలేయ శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా సర్జికల్ గ్యాస్ట్రో బృందమే చేయడంతో వైద్యులపై ఒత్తిడి పెరగడంతోపాటు రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. దీన్ని అధిగమించేందుకు కార్పొరేట్ను మించి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కాలేయ మార్పిడి తర్వాత అవసరమయ్యే చికిత్సను కూడా అందించేందుకు ప్రత్యేక ఉపవిభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. గాంధీలో కాలేయ మార్పిడి యూనిట్ అందుబాటులోకొస్తే ఖరీదైన ఈ శస్త్రచికిత్సలు మరింతమంది నిరుపేదలకు అందే అవకాశం ఉంది.
8వ అంతస్తులో కేటాయింపు
గాంధీ దవాఖాన ప్రధాన భవనంలోని 3,8వ అంతస్తులో కాలేయ మార్పిడి యూనిట్కు స్థలాన్ని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. 8వ అంతస్తు కేవలం కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం కేటాయించగా, తదుపరి చికిత్స, పర్యవేక్షణ, ఐసీయూ వార్డులు తదితర వాటికోసం 3వ అంతస్తును కేటాయించారు. అధునాతన వైద్య సౌకర్యాలతో కూడిన ప్రత్యేక థియేటర్లతోపాటు పిల్లలు, పెద్దలకు సైతం కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిపేలా ఏర్పాట్లు చేయనున్నారు.
కాలేయ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం
గాంధీ దవాఖానలో త్వరలో ఏర్పాటు చేయబోయే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల విభాగం వల్ల కాలేయం విఫలమైన, ఇతర కాలేయ సంబంధిత వ్యాధులకు గురై కాలేయ మార్పిడి కోసం ఎదురుచూసే రోగులకు మరింత ఉపశమనం కలగనుంది. ఉస్మానియా,నిమ్స్కు అదనంగా గాంధీ కూడా అందుబాటులోకి వస్తే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య పెరగనుంది. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను పరిశీలిస్తే ఉస్మానియాలో 2013 నుంచి 2022 ఏప్రిల్ 10 వరకు 13 శస్త్రచికిత్సలు, నిమ్స్లో 12 శస్త్రచికిత్సలు జరిగినట్లు జీవన్దాన్ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానలు కలిపి 2013 నుంచి ఇప్పటివరకు 932 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అనుమతి రాగానే ప్రారంభిస్తాం
గాంధీ దవాఖానలో ప్రస్తుతం గ్యాస్ట్రో విభాగం మాత్రమే ఉంది. త్వరలో లివర్ ట్రాన్స్ప్లాంట్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం 8వ అంతస్తులో స్థలాన్ని కేటాయించాం. లివర్ ట్రాన్స్ప్లాంట్ కేర్ యూనిట్కు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు డీపీఆర్ పంపించాం. ఉన్నతాధికారుల నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన