15వ తేదీలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశాలు
సిటీబ్యూరో, సెప్టెంబరు 12 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు పచ్చని అందాలతో కనువిందు చేయనున్నాయి. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా చెరువు కట్టపై ఆహ్లాదపరిచే మొక్కలను నాటేందుకు అధికారులు సిద్ధ్దమయ్యారు. చెరువు కట్ట, బఫర్ ఏరియాతో పాటు లేక్ చుట్టూరా విరివిగా ప్లాంటేషన్ పనులు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 15లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే చెరువుల సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్, ఎంట్రన్స్ ఫ్లాజా, లైటింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నారు. వలస పక్షులను ఆకర్షించేలా బ్యూటిఫికేషన్, పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదం, ఆనందాన్ని పంచే పూలు మొక్కలు, వాకర్స్, పర్యాటకులకు వీలుగా బెంచీలు తదితర బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నారు.