మైలార్దేవ్పల్లి, జూలై 21 : పద్మశాలీలకు టీఆర్ఎస్ నాయకుడు, మాజీ టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తీపి కబురు అందించారు. పద్మశాలి సామాజిక వర్గానికి ప్రభుత్వ పరంగా ప్రత్యేక పథకాన్ని అమలు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని, రైతుబంధు, దళితబంధు మాదిరిగానే ఉండబోతున్నదని తెలిపారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఉష్కెమూరి నిరంజన్ ఆధ్వర్యంలో రమణను బుధవారం ఆయన నివాసంలో కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలీలు అధిక సంఖ్యలో ఉండి కూడా రాజకీయంగా ఎదుగలేకపోతున్నారని, వారు రాజకీయంగా, సామాజికంగా ఎదుగాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.
అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. పద్మశాలీలు ఏకదాటిపై ఉండి టీఆర్ఎస్కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలకు తోడుగా ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి ఏర్వ సత్యనారాయణ, ప్రతినిధులు విజయ్, వెంకటేశ్ , సూర్యనారాయణ, కోట జగదీశ్, శ్యామ్కుమార్, యాదయ్య, దొంతరాజు, ఉష్కమూరి బాలకృష్ణ, శ్రీనివాస్, రవీందర్, యాదగిరి, మురళి, తదితరులు పాల్గొన్నారు.