దుండిగల్, అక్టోబర్ 25 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గం అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, గత తొమ్మిదేండ్లుగా పార్టీకి సేవలందిస్తున్న నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షణ్ముక శ్రీనివాస్(ఎంఎస్) వాసు తన ముఖ్య అనుచరుడు, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సోషల్ మీడియా ప్రతినిధి గుబ్బల లక్ష్మీనారాయణ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి పంపించినట్లు స్పష్టం చేశారు. రానున్న రెండుమూడు రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, నియోజకవర్గంలో ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తున్న నాయకుడి వ్యవహార శైలితో విసిగిపోయి తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే మరి కొందరు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారన్నారు.