కేపీహెచ్బీ కాలనీ, జూన్ 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలతో భరోసా కల్పించడం జరిగిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎన్.కె.ఎన్.ఆర్ గార్డెన్లో కూకట్పల్లి నియోజకవర్గం సంక్షేమ సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సస్యశ్యామలంగా మారిందన్నారు. పుట్టిన బిడ్డనుంచి పండు ముసలి వరకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు మైనార్టీలకు, మహిళలకు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
మహిళలకు సమున్నత గౌరవాన్ని ఆదరణను కల్పిస్తుందని, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య లక్ష్మితో బాలామృతం, పోషక పదార్థాలు అందించడం, దివ్యాంగులకు స్కాలర్షిప్స్, వివాహ ప్రోత్సాహకాలు అందుతున్నట్లు తెలిపారు. ప్రసవ సమయంలో కేసీఆర్ కిట్టు, ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో ఆర్థిక సహాయం, చదువుకునేందుకు ఉపకార వేతనాలు, ఉపాధి కోసం వడ్డీలేని రుణాలు, వృద్ధాప్యంలో ఆసరా పింఛన్లతో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దళితబంధుతో దళితులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రూ.10 లక్షల సాయం అందుతున్నదన్నారు. గిరిజనులకు కులాంతర వివాహ ప్రోత్సాహాలు, అభ్యున్నతి కోసం ప్రత్యేక రుణాలు అందుతున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూకట్పల్లి నియోజకవర్గంలో 44వేల మంది లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. నియోజకవర్గంలో 31,857 లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందుతున్నాయని.. మాతాశిశు వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 85 అంగన్వాడీ కేంద్రాలతో 15వేలకు పైగా బాలింతలు, గర్భిణులు లబ్ధిపొందారని.. ఆరోగ్యలక్ష్మితో 2వేల మంది లబ్ధిదారులకు, ఆరుమంది అంగవైకల్యం కలిగిన వారికి మేలు జరిగిందన్నారు. వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ అండ్ లాండ్రీలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా 1003 మంది లబ్ధిపొందుతున్నారని.. కల్యాణలక్ష్మితో 5530 మంది.. బీసీ, ఈబీసీ ఉపకార వేతనాలతో 79101 మంది, సబ్సిడీ మంజూరుతో 2018 మంది, గుడుంబా ప్రభావిత పునరావాప పథకంతో 18 మంది లబ్ధిపొందినట్లు తెలిపారు.
జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో షాదీముబారక్తో 5195 మంది, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకంతో 31661 మంది, చీఫ్ మినిస్ట్రర్ ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకంతో 47 మంది, స్వయం ఉపాధి పథకంతో 132 మంది లబ్ధిపొందినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 5530 మందికి కల్యాణలక్ష్మితో తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందినట్లు తెలిపారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ మెట్రిక్ ద్వారా 20262 మంది, ప్రీ మెట్రిక్ ద్వారా 118 మంది, అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి ద్వారా 35 మంది విద్యార్థులు లబ్ధిపొందారని.. దళితబంధుతో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ మెట్రిక్ ద్వారా 4096 మందికి, ప్రీ మెట్రిక్ ద్వారా 11 మందికి, అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి ద్వారా ఒకరికి, కల్యాణలక్ష్మితో 168 మందికి లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీషాబాబురావు, జూపల్లి సత్యనారాయణ, సబీహాబేగం, డీసీ రవికుమార్, తాసీల్దార్ గోవర్ధన్ ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
బతుకుదెరువు కోసం నగరానికొచ్చి జీవిస్తున్నాం. ఆడబిడ్డ పెండ్లి చేయడానికి ఖర్చులకు భయపడ్డాం. పేదింట్లో ఆడబిడ్డ పెండ్లికి సీఎం కేసీఆర్ లక్షా నూటపదహారు రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిసింది. ఆడబిడ్డ పెండ్లి కాగానే దరఖాస్తు చేసుకున్నాం. ఎవరికీ రూపాయి ఇవ్వకుండానే లక్ష రూపాయల చెక్కు చేతికిచ్చారు. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల అదృష్టం. ఆడబిడ్డ పెండ్లి చేసిన తల్లిదండ్రులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– ఆర్.వి.భారతి, కేపీహెచ్బీ కాలనీ
ప్రైవేట్ కంపెనీలో పదివేల జీతంతో పనిచేస్తున్నా. కుటుంబానికి పోషించడానికి ఇబ్బందులు పడ్డా. ఏదైనా దుకాణం పెట్టుకోవాలని అప్పులు అడిగినా పుట్టలేదు. దళితబంధుతో వెనుకబడిన దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు ఇస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కృష్ణారావును కలిసి దరఖాస్తు చేసుకున్నాం. దళితబంధుతో వచ్చిన డబ్బులతో కేపీహెచ్బీ కాలనీలో కిరాణం దుకాణం పెట్టాను. నెలకు రూ.30 నుంచి 40 వేలు సంపాదిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. కష్టకాలంలో సాయం చేసిన సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే కృష్ణారావు జీవితాంతం రుణపడి ఉంటాను.
– కొంబత్తుల పెద్దిరాజు, కేపీహెచ్బీ కాలనీ
నగరంలో కులవృత్తులను నమ్ముకుని బతికే వారి పరిస్థితులు కష్టంగా ఉన్నాయి. కార్పొరేట్ శక్తులు రావడంతో కులవృత్తులు చేసుకునే వారికి జీవనోపాధి లేకుండా పోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మరి, కమ్మరి, నాయిబ్రాహ్మణ, వడ్డెర, విశ్వబ్రాహ్మణ, సగర, రజక, కంసాలి, వృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడానికి ముందుకు రావడం సంతోషకరం. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాను.
– శ్రీనివాసచారి (గోల్డ్స్మిత్), ఫతేనగర్