ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతికి శనివారం రాత్రి 12గంటలకు ఉద్వాసన పూజ నిర్వహించారు. అనంతరం కాల నాగేశ్వరి, కృష్ణకాళి విగ్రహాలతోపాటు రుద్ర మహాగణపతిని ట్రాలీ మీదకు చేర్చారు. వెల్డింగ్ పనుల అనంతరం ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు ట్రాలీ అలంకరణ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నంబర్ 4 వద్ద మహా గణపతి నిమజ్జనం చేయనున్నారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 18 : ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి నేడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. నవరాత్రి ఉత్సవాల్లో సుమారు 25 లక్షల వరకు భక్తులు హాజరైనట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం రాత్రి 12గంటలకు నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 3గంటల మధ్య ముగుస్తుందని వివరించారు.
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకు 10 సంవత్సరాలుగా ఎస్టీసీ ట్రావెల్స్ ఏజెన్సీ ట్రాలీని వినియోగిస్తున్నారు. 26 టైర్లతో కూడిన ఈ ట్రాలీ సుమారు 130 టన్నుల బరువును అవలీలగా మోస్తుంది. నిబంధనల ప్రకారం 55 టన్నులకు మాత్రమే ఈ ట్రాలీని వినియోగిస్తారు. ప్రస్తుతం ఖైరతాబాద్ గణేశుడి విగ్రహానికి తోడుగా పంచముఖాల్లో ఉన్న ఐదుగురు దేవతల వాహనాల విగ్రహాలతో కలిపి మొత్తం సుమారు 40టన్నుల వరకు బరువు ఉంటుంది. హైడ్రాలిక్ బ్రేక్స్తో కూడిన ఈ ట్రాలీలో స్వామి ఊరేగింపు నిమజ్జన ఘాట్ వరకు కొనసాగుతుంది. ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్స్ ఈ వాహనాన్ని శోభాయాత్రకు ఉచితంగా అందజేస్తుండగా, రథసారథిగా భాస్కర్ రెడ్డి తనవంతు సేవ చేసుకుంటున్నారు.
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనోత్సవానికి ఈ ఏడాది టోలిచౌకి సాలార్జంగ్ కాలనీకి చెందిన సూపర్ క్రేన్స్ సంస్థకు చెందిన క్రేన్ను వినియోగిస్తున్నారు. 200 టన్నుల బరువును అవలీలగా పైకి ఎత్తే కెపాసిటీ దీని సొంతం. హైడ్రాలిక్ టెలిస్కోపిక్ టెక్నాలజీతో కూడిన ఈ క్రేన్ డ్రైవర్గా ఔదేశ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
శనివారం రాత్రి 12గంటలకు అనంత చతుర్థి శుభగడియలో స్వామి వారి కలశాన్ని కదిలించి ఉద్వాసన పూజ నిర్వహించారు. అనంతరం ఉప మండపాల్లో ఉన్న కాల నాగేశ్వరి, కృష్ణకాళీ విగ్రహాలను ట్రాలీపై అమర్చి, ఆపై రుద్ర మహాగణపతిని ట్రాలీ మీదకు చేర్చారు.. ఉదయం 3గంటల నుంచి ట్రాలీని అలంకరించారు. ఉదయం 7గంటలకే శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నం.4 వద్ద మ.12 నుంచి 1గంట మధ్యలో నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు చెబుతుండగా, ఉత్సవ కమిటీ మాత్రం మ. 2గంటల నుంచి 3గంటల మధ్యలో మహాక్రతువు పూర్తవుతుందని తెలిపారు.
గణేశ్ మహా ఊరేగింపును సాఫీగా పూర్తి చేసేందుకు పోలీసులు సకల ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనాన్ని ఆదివారం మ. 2 గంటలలోపు పూర్తి చేసేందుకు ఉత్సవ కమిటీతో కలిసి పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక బాలాపూర్ నుంచి హూస్సేన్సాగర్ వరకు సాగే 17 కి.మీ.ల ఊరేగింపునకు 27వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేయగా, ఇందులో తొలిసారిగా వెయ్యిమంది మహిళా పోలీసులు పాల్గొనున్నారు. బషీర్బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో గణేశ్ ఊరేగింపు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ శనివారం వెల్లడించారు.