ఖైరతాబాద్, సెప్టెంబర్ 11 : ఏడాదికో రూపంలో భక్తజనులను అలరిస్తున్న ఖైరతాబాద్ భారీ వినాయకుడు ఈసారి శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా కొలువుదీరారు. శుక్రవారం వినాయకచవితి సందర్భంగా విఘ్నేశ్వరుడికి కలశ, పుష్ప, పత్ర, నైవేద్యాలతో పూజించారు. ఆనవాయితీగా తొలిపూజను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ నిర్వహించారు. అంతకుముందు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 60 అడుగుల కండువా, జంధ్యం (యజ్ఞోపవితం), గరికమాల, పట్టువస్ర్తాలను గుర్రపుబగ్గీలో లక్డీకాపూల్లోని రాజ్దూత్ చౌరస్తా నుంచి గణేశుడి మండపం వరకు వేదపండితుల మంత్రోచ్ఛరణలు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు, కోలాటాల నడుమ తీసుకొచ్చారు. పూజాది కార్యక్రమాల అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ కరోనాను ఖైరతాబాద్ గణేశుడు రూపుమాపుతారని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి ఉత్సవాలు నిదర్శనమని..కుల, మత, భాషాలకు అతీతంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ఈ వేడుకల్లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, టీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్చార్జి గజ్జెల నగేశ్, ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు గజ్జెల అజయ్, గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్రాజ్, ఉపాధ్యక్షుడు మహేశ్యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సింగారి రాజ్కుమార్ పాల్గొన్నారు.
మంత్రుల ప్రత్యేక పూజలు: ఖైరతాబాద్ శ్రీపంచముఖ రుద్ర మహాగణపతిని పురపాలక,ఐటీశాఖ మంత్రి కేటీఆర్, కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులకు వినాయకుడి ప్రతిమను ఉత్సవ కమిటీ బహూకరించి ఘనంగా సత్కరించింది.