హైదరాబాద్, నమస్తే తెలంగాణ, జూలై 30: ‘వ్యాపారం చేస్తే నష్టాలు వచ్చాయి. విధి ఆడిన నాటకంలో పాత్రధారిగా హైదరాబాద్ వచ్చాను. రాత్రి కాలేజీలో లా చేశాను. న్యాయవాదిగా నా చిత్తశుద్ధిని సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎంతగానో ప్రోత్సహించారు. న్యాయమూర్తిగా విధులను సక్రమంగా నిర్వహించిన సంతృప్తి మిగిలింది. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం తన పదవీ విరమణ సందర్భంగా జరిగిన వీడోలు సమావేశంలో చెప్పారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అధ్యక్షతన శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తుల (ఫుల్ కోర్టు) సమావేశం ఆయనకు ఘనంగా వీడోలు చెప్పింది. న్యాయమూర్తిగా ఎనిమిదేండ్ల కాలంలో జస్టిస్ చల్లా 18,890 పిటిషన్లు, 13,752 మధ్యంతర పిటిషన్లను పరిషరించి అందరికీ ఆదర్శంగా నిలిచారని చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ కొనియాడారు. ఏజీ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, జస్టిస్ చల్లా సేవల్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్ రెడ్డి, రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్ రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్, పీపీ ప్రతాప్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.
హైకోర్టు బార్ అసోసియేషన్ సైతం జస్టిస్ చల్లాను ఘనంగా సన్మానించింది. అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ చల్లా కోదండరాం దంపతులకు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శులు సి.కల్యాణ్ రావు, టి.సృజన్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మహ్మద్ ముంతాజ్ పాష ఇతరులు పాల్గొన్నారు. జస్టిస్ చల్లా కోదండరాం ఏపీలోని తాడిపత్రిలో పుట్టారు. 1983లో లా చేశారు. 2009లో సీనియర్ న్యాయవాది అయ్యారు. 2013 ఏప్రిల్ 12న హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం పూర్తి అవుతుంది.