బంజారాహిల్స్,డిసెంబర్ 6: సమాజంలోని సమస్యలు సమసిపోయేలా లోతైన అధ్యయనం ద్వారా పాత్రికేయులు పరిశోధనాత్మక కథనాలు రాయాలని సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మంగళవారం ప్రముఖ పాత్రికేయులు ‘నార్ల వెంకటేశ్వరరావు స్మారకోపన్యాసం’ కార్యక్రమానికి టంకశాల అశోక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విలువలతో కూడిన పాత్రికేయులుగా నార్ల వెంకటేశ్వరరావు జాతీయ స్థాయి లో గుర్తింపు పొందారని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో యువ జర్నలిస్టుల్లో విషయ పరిజ్ఞానం లోపిస్తున్నదని, లోతుగా అధ్యయనం చేయకుండానే వార్తలు రాస్తుండటంతో అదే నిజమనే భావనలో పాఠకులు ఉండిపోతున్నారన్నారు. నార్ల పుస్తకాలను అంబేద్కర్ యూనివర్సిటీ లైబ్రరీకి అందించడం గర్వకారణమని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కే.సీతారామారావు అన్నారు. అనంతరం నార్ల వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించారు.కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా.ఏవీఎన్.రెడ్డి, జీఆర్సీఆర్ అండ్ డీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధారాణి, ప్రొఫెసర్లు శ్రీనివాస్, ఆనంద్పవార్,రవి, డా.ఎల్వీకే రెడ్డి పాల్గొన్నారు.