బంజారాహిల్స్ : ట్రావెల్స్ బస్సులో ప్రయాణించి ఇంటికి వచ్చిన మహిళ బ్యాగులోంచి ఆభరణాలు మాయమయ్యాయి. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ సమీపంలోని నవోదయ కాలనీ లో నివసిస్తున్న కే.ప్రసన్నసత్య తన కుమార్తె కే.మోక్షతో కలిసి ఈనెల 16న రాత్రి కాకినాడలో మైత్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఎక్కింది.
17న ఉదయం ఏడున్నర ప్రాంతంలో అమీర్పేటలో బస్సు దిగిన ప్రసన్న ఇంటికి చేరుకుంది.18న సాయంత్రం తన బ్యాగును తెరిచిచూడగా అందులో ఉండాల్సిన బంగారు గాజులు, నెక్లెస్, గొలుసు తదితర 10తులాల బంగారు ఆభరణాలు, 30తులాల వెండి ఆభరణాలు కనిపించలేదు. బ్యాగును పరిశీలించగా బ్యాగు కత్తిరించి ఉన్నట్లు గుర్తించింది.
బస్సులో లగేజీ బాక్సులో పెట్టిన బ్యాగులోంచి ఆభరణాలు చోరీ చేశారని, బస్సు డ్రైవర్, క్లీనర్లపై అనుమానాలున్నాయంటూ సోమవారం రాత్రి బాధితురాలు ప్రసన్న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.