సిటీబ్యూరో, అగస్టు 23(నమస్తే తెలంగాణ): ఓ మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు సోమవారం జీవిత ఖైదు, జరిమానా విధించింది. 2019 సెప్టెంబరు 9న మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి వస్తుండగా అదే ప్రాంతంలో మద్యం సేవిస్తున్న ఆరుగురు నిందితులు, ఓ మైనర్ బాలుడు మహిళను బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై మియాపూర్ పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించి అభియోగాలను నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరాన్ని నిర్ధారించే విధంగా ఆధారాలు రుజువు కావడంతో రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు, 7వ అదనపు జిల్లా జడ్జి నిందితులు షేక్ షౌకత్, మహ్మద్ అఫ్రోజ్, మహ్మద్ ఖాలీద్, అబ్దుల్ సల్మాన్ ఖాన్, షేక్ సల్మాన్, ముజాయిద్ ఖాన్లకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.20 వేలు జరిమానా విధించింది.
సిటీ క్రిమినల్ కోర్ట్ నాంపల్లి , ఆగస్టు 23 : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి హాకాభవన్ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి జి.ప్రేమలత పదేండ్లు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు. సైఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలికపై మహమ్మద్ అబ్బు అనే వ్యక్తి అత్యాచార యత్నం చేయడంలో అతడిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి కోర్టులో విచారణ కొనసాగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయేషా రఫత్ బాలిక తరఫున వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి పదేండ్లు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధించారు.