సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : మేడిపల్లి పీఎస్ పరిధిలో వృద్ధురాలిపై దాడిచేసి, గొలుసు దొంగతనం చేసిన కేసులో నిందితుడు జోగా శ్రీనివాస్కు పదేండ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ గురువారం నాలుగో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి రాజగోపాల్ తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కథనం ప్రకారం.. మేడిపల్లి పరిధిలోని న్యూ సాయి మారుతీనగర్లో బాధితురాలు మాడిశెట్టి రాజేశ్వరి నివాసముంటున్నారు. మార్చి 20, 2015లో పీర్జాదిగూడకు చెందిన జోగా శ్రీనివాస్ (25) ఆ వృద్ధురాలిని కత్తితో తీవ్రంగా గాయ పరిచి.. ఆమె మెడలో ఉన్న రోల్డ్గోల్డ్ గొలుసును బంగారంగా భావించి దొంగలించాడు. బాధితురాలు రాజేశ్వరి కుమారుడు మాడిశెట్టి శ్రీనివాస్ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్కు పదేండ్ల జైలు శిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.