హైదరాబాద్: దేశంలో చాలా మంది పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, అవయవ మార్పిడి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటే, అవయవ దాతల సంఖ్య మాత్రం వందలు.. వేలల్లోనే ఉంటోంది. ఫలితంగా చాలామంది సమయానికి అవయవ మార్పిడి జరగక ఇబ్బంది పడుతున్నారు. అవయవ దానంపై అవగాహన పెంచేందుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతిబాబు ముందుకొచ్చారు. ఫిబ్రవరి 12న తన పుట్టిన రోజు సందర్భంగా మరణానంతరం తాను అవయవదానం చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు నాడు తమ మరణం గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు. అలాంటిది, అవయవదానంపై సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు జగపతిబాబు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు.. ఆయన అభిమానులు మరో 100 మంది వరకు తాము సైతం అవయవదానం చేస్తామని వేర్వేరు చోట్ల ప్రతిజ్ఞ చేశారు.
జన్మదినం సందర్భంగా ఏదైనా పదిమందికీ ఉపయోగపడే కార్యక్రమం చేయాలనుకున్నానని, కానీ అన్నింటికంటే అవయవదానం ప్రతిజ్ఞ అయితే మరింతమందికి స్ఫూర్తి కలిగిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని జగపతిబాబు అన్నారు. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, కళ్లు, చర్మం, చేతులు.. ఇలా ఎన్నో రకాల అవయవాలను మరణానంతరం అవసరం ఉన్న వాళ్లకు అందిస్తే వాళ్లకు కొత్త జీవితం లభిస్తుందని ఆయన అన్నారు. తన అభిమానులంతా అవయవదానం చేయడానికి ముందుకురావాలని జగపతిబాబు పిలుపునిచ్చారు. దీనివల్ల మరణించిన తర్వాత కూడా అమరులుగా మిగిలిపోతారని చెప్పారు.
తమకు అయినవాళ్ల ప్రాణాలు పోతున్నాయని తెలిసి, అదే సమయంలో బాధను దిగమింగుకుని మరికొందరి ప్రాణాలు నిలబెట్టేందుకు ముందుకు రావడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని కిమ్స్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. అలాగే కోవిడ్ మహామ్మారి సమయంలో ఆసుపత్రిలో చేరిన ఎంతో మంది పేద సినీ కార్మికులకు ఆసుపత్రి బిల్లులు చెల్లించారు. అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్న పేదవారికి గుండె ఆపరేషన్లకు అవసరమైన డబ్బులను కూడా సమకూర్చారు.
బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితిలో ఉన్నవారి నుంచి సేకరించిన అవయవాలు ఎంతోమంది ప్రాణాలను నిలబెడతాయని ఆయన చెప్పారు. ఇటీవలే కేరళలోని కొచ్చిలో ఒక యువకుడు బ్రెయిన్డెడ్ అవ్వగా, అతడి కీలక అవయవాలతో పాటు చేతులను కూడా కర్ణాటకలోని బళ్లారికి చెందిన వ్యక్తికి అమర్చి అతడికి కొత్త జీవితాన్ని ఇచ్చిన ఘటనను ఆయన గుర్తుచేశారు. మరణానంతరం శరీరాన్ని యథాతథంగా దహనం లేదా ఖననం చేయడం కంటే, అవయవదానం చేస్తే వాటిద్వారా ప్రాణాలు నిలబెట్టుకున్నవారిలో తమవారిని చూసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. తన అభిమాన నటుడు జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో సాహసోపేతమని, ఆయన స్ఫూర్తితో మరింతమంది ముందుకు రావాలని కోరారు.
కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీవన్దాన్ ఇన్ఛార్జి, నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత, అవయవమార్పిడి నిపుణులైన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో అవయవదానం చేసిన పలువురి కుటుంబసభ్యులను ఘనంగా సన్మానించారు.