బేగంపేట్ మార్చి 11: ఖాదీ వస్ర్తాలను ప్రోత్సహించడమంటే మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించుకోవడమేనని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో బేగంపేట్ రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణంలో శనివారం ఖాదీ గ్రామోద్యోగ్ వస్త్ర ప్రదర్శనను ఆయన ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతికి అనుగుణంగా దుస్తులను తయారు చేసుకోవడం గొప్ప కళగా అభివర్ణించారు.
స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మన బ్రాండ్ అంతర్జాతీయంగా ఎదగాలని చెప్పారు. ఖాదీ కళాకారులకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందేలాతన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ వస్త్ర ప్రదర్శన ఈ నెల 31వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, దయానంద్, రామానందతీర్థ ఫౌండర్ చైర్మన్ పీవీ ప్రభాకర్రావు, వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, సురభి సెంటర్ డైరక్టర్ శేఖర్ మారంరాజు, శశిరంజన్, సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.