కాప్రా, ఫిబ్రవరి 8 : కాప్రా సర్కిల్లో ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ మేరకు సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, మీర్పేట్ హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో కొత్త ట్రేడ్లకు లైసెన్సులను జారీ చేయడం, ఇప్పటికే ఉన్న ట్రేడ్లకు సంబంధించి లైసెన్సు ఫీజు రెన్యూవల్ చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ట్రేడ్ లైసెన్సుల జారీలో వేగవంతం చేయాలని, రెసిడెన్షియల్ ఏరియాల్లో చేపట్టే వాణిజ్య వ్యాపారాలకు కూడా ట్రేడ్ లైసెన్సులు జారీ చేయాలని సర్కిల్ డీసీ ఆదేశించడంతో సర్కిల్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
బుధవారం ఒక్కరోజే కొత్తగా 59 ట్రేడ్ లైసెన్సులకు సంబంధించి ఫీజు రూ.82వేలు వసూలు చేసినట్లు సర్కిల్ అసిస్టెంట్ లైసెన్సింగ్ అధికారి నర్సింగరావు, శానిటరీ సూపర్వైజర్ నాగరాజు తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు 175 ట్రేడ్ లైసెన్సులు జారీ అయ్యాయని వారు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రేడ్ లైసెన్సుల జారీని ముమ్మరం చేసినట్లు తెలిపారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ ట్రేడ్లైసెన్సులు కలిగి ఉండాలని, ఇదివరకు లైసెన్సు పొంది ఉన్నవారు పునరుద్ధరించుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలని వారు కోరారు.