సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ): సాధారణంగా టీ స్టాల్ పెట్టాలంటే ఒకరిద్దరు మనుషులు, అంతకు మించి ఉండే పాత్రలు, సామగ్రి కావాలి. కానీ ఇవేవీ లేకుండానే ఏకంగా ఒక్క క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి టీ, కాఫీ, బిస్కట్తోపాటు, బాదం మిల్క్, లెమన్ టీ వంటివి ఇన్స్టాంట్గా కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్కు చెందిన జెమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ సంస్థ… ఈ సరికొత్త వెండింగ్ మెషిన్ను ఆవిష్కరించి.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నది. గతంలోనూ ఈ సంస్థ గోల్డ్ ఏటీఎంలను రూపొందించింది.
కావాల్సిన ఐటెం కోసం..
ఈ వెండింగ్ మెషిన్లో టీ, కాఫీ, లెమన్ టీ, బాదం మిల్క్ను ఒక్కో ఐటమ్ను 150 కప్పులతో సర్వ్ చేసేంతగా, అలాగే 150 వాటర్ బాటిళ్లను లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు 150 బిస్కెట్ ప్యాకెట్లను స్టోర్ చేసుకునే సామర్థ్యం ఉండగా, కావాల్సిన ఐటమ్స్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వేడి వేడిగా సర్వ్ చేసేస్తుందీ యంత్రం. దీనికి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే ఉండటంతో స్వయం ఉపాధి పొందేవారికి వీలుగా డిజైన్ చేశారు.
రూ.1.65 లక్షల పెట్టుబడితో..
ఇప్పటికే ఈ వెండింగ్ మెషిన్ను దళిత బంధు కార్యక్రమానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. అలాగే తెలుగు రాష్ర్టాల ఆర్టీసీ యాజమాన్యాలు కూడా బస్టాండ్లలో వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేసేందుకు సదరు కంపెనీకి అవకాశమిచ్చాయి. రూ. 1.65 లక్షల పెట్టుబడితో స్వయం ఉపాధికి అవకాశం ఉండటంతో… ప్రారంభించిన ఒక నెల రోజుల్లో ఏకంగా 400 మంది రిటైల్ విక్రయాలు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
మూడు నెలలకో కొత్త ప్రొడక్టు..
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన వెండింగ్ మెషిన్లను ప్రతి మూడు నెలలకోసారి మార్కెట్లోకి తీసుకువస్తాం. ఇప్పటికే 6 ప్రొడక్టులకు పేటెంట్ రాగా, త్వరలో ఆటోమేటెడ్ క్లినిక్, టిఫిన్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నాం. వీటితోపాటు వెండింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కూడా అభివృద్ధి చేస్తున్నాం.
– వినోద్కుమార్, జెమ్ ఓపెన్క్యూబ్ టెక్నాలజీస్ ఫౌండర్