Suicide | బంజారాహిల్స్, మార్చి 19 : ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదని మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 హైలం కాలనీలో నివాసం ఉంటున్న ఎర్ర స్వామి కుమార్తె సుమ(17) కర్నూల్లోని బీసీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది.
ఇటీవల పరీక్షలు పూర్తవడంతో ఆమె హైలం కాలనీలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉంటున్న సుమ తాను పరీక్షలు సరిగ్గా రాయలేదంటూ బాధపడుతోంది.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమ గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గంటన్నర తర్వాత ఎర్ర స్వామి చెల్లెలు కుమార్తె లేఖ వారి ఇంటికి వచ్చింది. సుమ గది వద్దకు వెళ్లి తలుపు తట్టగా తీయలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతున్న సుమా కనిపించింది. ఆమెను హుటాహుటిన స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు మృతురాలి తండ్రి స్వామి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.