ముషీరాబాద్/ అంబర్పేట, జనవరి 21: గత కొన్నేండ్లుగా శంకరమఠం విజిటేబుల్, ఓల్డ్ రామాలయం ప్రాం తాల ప్రజలకు ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. శనివారం నల్లకుంట డివిజన్ శంకరమఠం విజిటేబుల్ ఏరియా, ఓల్డ్ రామాలయం మీదుగా కోరంటి వరకు నిర్మిస్తున్న వరద నీటి కాలువ(నాలా) నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృత, ఎస్ఎన్డీపీ అధికారులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణానికి వినియోగిస్తున్న మెటీరియల్ను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబర్పేట్ నియోజకవర్గాల సరిహద్దు పద్మకాలనీలో చేపడుతున్న నాలా విస్తరణ, స్లాబు నిర్మాణ పనులను శనివారం ముషీరాబాద్, అంబర్పేట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్లు పరిశీలించారు. పనులు సాగుతున్న తీరు, ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎస్ఎన్డీపీ, ఇతర విభాగాల అధికారులతో కలిసి పద్మకాలనీలో పర్యటించి నాలా స్లాబు నిర్మాణ పనులు సాగుతున్న తీరును వాకబు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు పనులు ఆలస్యంగా చేపడుతుండటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు.
నాలా విస్తరణ పనుల కోసం తవ్విన మట్టి తొలగించకపోవడం వలన కనీసం నడవలేకపోతున్నామని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే లు స్థానికులు, వాహనదారుల ఇబ్బందుల దృష్ట్యా పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాదచారులు నడక సాగించడానికి వీలుగా వెంటనే మట్టికుప్పలను తొలగించాలని, నాలా విస్తరణ, స్లాబు నిర్మాణ పనులను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. కోరంటి దవాఖాన వెనక వైపు నాలా స్లాబు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి వరద సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, రాంనగర్ కార్పొరేటర్ రవిచారి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాధవ్, బి. శ్రీనివాస్రెడ్డి, రవియాదవ్, సురేందర్, శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమీక్ష..
కవాడిగూడ డివిజన్ బండమైసమ్మనగర్, ఎల్ఐసీ వెనక బస్తీలో మంచినీరు, డ్రైనేజీ సమస్యలపై చర్చించడానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ శనివారం అధికారులతో బస్తీలో సమావేశమయ్యారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బండమైసమ్మనగర్ మంచినీటి పైపులైన్ సమస్య పరిష్కారం కోసం ఇటీవల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో పనులు చేపట్టడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. స్థానికుల ఇబ్బందుల దృష్ట్యా త్వరితగతిన డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా వెంటనే రోడ్డు నిర్మాణ పనులు సైతం చేపట్టడానికి జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. త్వరలోనే ఎల్ఐసీ వెనుక బస్తీలో మంచినీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, వల్లాల శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.