బండ్లగూడ, ఆగస్టు 16 : విద్యార్థులకు మంచి విద్యానందించడం, సమాజం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి కల్పనను అలవర్చుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సంస్థలతో కలిసి ‘చెలిమి-అంకురం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజేంద్రనగర్ మండల పరిధి శివరాంపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు మొత్తం 33 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా బుధవారం శివరాంపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరై ‘చెలిమి-అంకురం’ కార్యక్రమంతో పాటు అదనపు గదులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చెలిమి-అంకురం అనే రెండు కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారని అందులో భాగంగా రాష్ట్రంలో వెయ్యి గురుకులాలు, 1500 గురుకుల జూనియర్ కళాశాలలు, 85 డిగ్రీ కాలేజీలు, రెండు పీజీ కాలేజీలు, నాలుగు ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేజీ టు పీజీ వరకు ఉచితంగా విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు అహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, విద్యాశాఖ సీఎస్ కరుణ, విద్యాశాఖ స్కూల్ డైరెక్టర్ దేవాసేనా, శీధర్రెడ్డి, డీఈవో సుసిందర్రావు, ఎంఈవో రాంరెడ్డి, కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్, స్థానిక నాయకులు పడమటి శ్రీధర్రెడ్డి, కొలన్ సుభాష్రెడ్డి, కొండమీది హరినాథ్, జలిగం చిత్తారి, తదితరులు పాల్గొన్నారు.
చెలిమి అనగా.. : విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతూ పాఠశాలకు వస్తారు. ఉపాధ్యాయులు వారితో స్నేహ (చెలిమి)భావంతో మాట్లాడుతూ సమస్యల నుంచి చదువు వైపు దృష్టిని మరల్చి విద్యాబుద్దులు నేర్పించాలి.
అంకురం అనగా.. : విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి వైపు అడుగులు వేసే విధంగా తీర్చిదిద్దాలి.