మేడ్చల్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ పథకానికి వచ్చిన దరఖాస్తుల సంఖ్యపై అధికారులకే సమాచారం లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇందిరమ్మ పథకంలో భాగంగా దరఖాస్తులను మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం స్వీకరించింది. అయితే జిల్లాలో ఇందిరమ్మ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చిన విషయమై అధికారులకే సమాచారం లేకపోవడం ఏమిటన్నది విమర్శలకు దారితీస్తున్నది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు స్థలాలను గుర్తించి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గానికి 480 చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో 1,920 ఇండ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఉప్పల్ నియోజకవర్గానికి మాత్రం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మాత్రం ఇప్పటికీ స్థలాన్ని గుర్తించలేదు. ఇందిరమ్మ పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ. 10 వేల రుసుంతో దరఖాస్తులను స్వీకరించారు.
ఇందులో ఇందిరమ్మ ఇంటి పథకానికి ఎంపికైన లబ్ధిదారుడు రూ. 6 లక్షలు చెల్లిస్తేనే పథకానికి అర్హులుగా గుర్తించనున్నారు. అయితే ప్రభుత్వం ఆశించిన మేరకు ఇందిరమ్మ పథకానికి దరఖాస్తులు రాలేవని, రూ. 10 వేల రుసుం చెల్లించలేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకునేందుకు దూరం కాగా మధ్యతరగతి కుటుంబాలు ఇందిరమ్మ పథకంపై అసక్తి కనబర్చలేదని తెలుస్తోంది. ఈ నెల 15 వరకు దరఖాస్తుల గడువు ముగిసినా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దరఖాస్తుల సంఖ్యపై అధికారులకు సమాచారం లేదంటే ఇందిరమ్మ పథకంపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అన్న విమర్శలు వస్తున్నాయి. అర్హులైన నిరుపేదలందరికీ అధికారంలో వచ్చి వెంటనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇండ్లను దరఖాస్తులను ప్రజాపాలన కార్యక్రమంలో ఎంతో ఆర్భాటంగా స్వీకరించి పాత దరఖాస్తులకు మంగళం పాడి తిరిగి రూ. 10 వేల రుసుంతో ఇందిరమ్మ దరఖాస్తులను స్వీకరించడంపై నిరుపేదలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలైన నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేయగా ఉప్పల్ నియోజకవర్గంలో మాత్రం ఇందిరమ్మ ఇంటి పథకానికి దరఖాస్తులను స్వీకరించలేదు. నాలుగు నియోజకవర్గాలకు ఇండ్ల నిర్మాణాలకు స్థలాలు గుర్తించగా, ఉప్పల్ నియోజకవర్గానికి ఎందుకు గుర్తించలేదని ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయరా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇందిరమ్మ పథకానికి సంబంధించి అధికారులకు ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాచారం లేదని తప్పించుకుంటున్నారు. కనీసం జిల్లాకు ఇందిరమ్మ పథకానికి వచ్చిన దరఖాస్తుల సంఖ్య తెలియదంటే జిల్లాలో అధికారులకు ఉన్నట్టా లేనట్టా అన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.