సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం క్యాష్లెస్ ట్రెండ్ కొనసాగుతున్నది. కరెన్సీ, నాణేల ప్రాధాన్యతను చాటేందుకు నగరానికి చెందిన ట్రావెల్ కన్సల్టెంట్ హరికృష్ణ వాల్మీకి ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని తన కార్యాలయంలో ‘నాణేలు, కరెన్సీల ప్రదర్శన’ ఏర్పాటు చేశారు. వందల ఏండ్ల నుంచి వస్తున్న నాణేలు, కరెన్సీల తేడాలతో వివిధ రకాల నోట్లను ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. సుమారు వంద దేశాల కరెన్సీలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. 1954లో ముద్రితమైన ఇండియన్ వన్ రూపీనోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1954 ఏప్రిల్ 4న రిజర్వ్ బ్యాంక్ ఇండియా ముద్రించిన వెయ్యి రూపాయల నోటు కూడా ప్రదర్శనలో ఉంది. 25 వందల ఏండ్ల క్రితం నాటి క్రీ.పూ. నాలుగో శతాబ్దం నాటి మగధ మౌర్య నాణేలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాణేలు, కరెన్సీలు ఇక కనుమరుగు అవుతున్నాయని, ఇక భవిష్యత్తు తరాలకు వాటిని చూసే అవకాశం లేదని, అందుకే తాను సేకరించిన ఈ నాణేలు, కరెన్సీలను సందర్శకుల కోసం ప్రదర్శనకు ఉంచానని హరికృష్ణ తెలిపారు.