బడంగ్పేట, ఆగస్టు8 : జల్పల్లిలో రాత్రికిరాత్రే వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. కబ్జా భూమికి కాపలాగా పహిల్వాన్ల పెట్టి.. కూల్చివేయకుండా అడ్డుకున్నా.. నేలమట్టం చేశా రు. ఒక దశలో కబ్జాదారులకు అధికారుల మధ్య వాగ్వా దం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరికి పోలీసుల సహకారంతో రూ.7కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడగలిగారు. బాలాపూర్ మండలం జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 178లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం రావడంతో తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ఐ శ్రీనివాస్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పహాడీషరీఫ్ పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను ఆదివారం జేసీబీ సహాయంతో కూల్చివేశారు. భూములకు ధరలు పెరుగడంతో అక్రమార్కుల చూపు ప్రభుత్వ స్థలాల వైపు మళ్లిందని, వాటిని కబ్జా చేసి పహిల్వాన్లను కాపాలాపెడుతున్నారని తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి చెప్పారు. తప్పుడు సర్వే నంబర్లు వేసి.. భూమిని కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 178లో ఉన్న భూమిని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తున్నామని, నాలుగు ఎకరాలు ఎస్టీపీ ఏర్పాటు చేసేందుకు కేటాయించినట్లు వెల్లడించారు. ఆ స్థలంపై పక్కనే ఉన్న ప్రైవేట్ భూమి యజమానులు రాత్రికిరాత్రి ప్రహరీ ఏర్పాటు చేశారని, అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న తమ సిబ్బందిని భయ బ్రాంతులకు గురి చేశారని తెలిపారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూమిని ఎవరూ కబ్జా చేసినా చట్ట పరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.