బంజారాహిల్స్ : బస్తీవాసుల సౌకర్యం కోసం మల్టీ పర్సస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసేందుకు కేటాయించిన స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించండి.. వారంరోజుల్లో ఆక్రమణలు తొలగించి నిర్మాణపనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ ,రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
అయితే అధికారులు స్పందించేలోగానే ఆక్రమంగా గుడిసెలు వేసిన వ్యక్తులు మాత్రం యుద్ద ప్రాతిపదికన స్పందించారు. రాత్రికి రాత్రే ప్రహరీ నిర్మాణం చేపట్టారు. అంతటితో ఆగకుండా ఈ ప్రహరీ గోడ చాలా కాలంనుంచి ఉందని నమ్మించేందుకు జాజు, సున్నంతో రంగులు వేశారు. దీంతో స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు.
షేక్పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం 12లో ఎన్బీటీనగర్ అయ్యప్ప స్వామి ఆలయం ఎగువ భాగంలో సుమారు 3వేల గజాలకు పైగా ప్రభుత్వ స్థలం ఉంది. అయ్యప్ప స్వామి ఆలయం ప్రధాన గేటు పక్కనుంచి పైన ఎమ్మెల్యే కాలనీ లే అవుట్ దాకా ఉన్న ఈ స్థలంలో స్థానికుల అవసరాల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.2కోట్ల నిధులను మంజూరు చేశారు. అయితే ఈ స్థలం మొత్తం కొండ ప్రాంతం కావడంతో బండరాళ్లు తొలగించేందుకు మరో రెండు కోట్లు అవసరం అవుతాయని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సూచించారు. దీంతో పనులు ప్రారంభం కాలేదు.
జాప్యాన్ని సాకుగా తీసుకున్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులు సుమారు 2వేల గజాల స్థలంలో కొన్ని గుడిసెలు వేయించడంతో పాటు స్థలం మాదే అంటూ కొత్త వాదన ప్రారంభించారు. పదిరోజుల క్రితం బస్తీలో పర్యటించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలు తొలగించాలని, స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్, టౌన్ప్లానింగ్ ఏసీపీని ఆదేశించారు.
దాంతో సదరు ఆక్రమణ దారులు రాత్రికి రాత్రే గుడిసెలు ఉన్న స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయడంతో పాటు గోడకు పాతగా కనిపించేలా రంగులు వేశారు. సుమారు 30కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలం ఆక్రమణల వ్యవహారంపై స్థానికులు మరోసారి మేయర్కు, ఎమ్మెల్యేకు, జోనల్ కమిషనర్, తహసీల్దార్కు ఫిర్యాదులు చేయడంతో కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆ స్థలం ప్రభుత్వానిదే..- శ్రీనివాసరెడ్డి, షేక్పేట మండల తాసీల్దార్
ఎన్బీటీనగర్ అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఖాళీగా ఉన్న స్థలం మొత్తం ప్రభుత్వానిదే. ఈ స్థలాన్ని మల్టీ పర్పస్ హాల్ నిర్మాణం కోసం కేటాయించారని షేక్పేట తాసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే పనులు ప్రారంభం కాకపోవడంతో అధికారికంగా స్థలాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించలేదు.
ఈ స్థలంలో కొంతమంది గుడిసెలు వేసుకున్నారని, వాటిని తొలగించి ఫెన్సింగ్ వేయాలని ఇటీవల మేయర్, ఎమ్మెల్యే ఆదేశించారన్నారు. ఒకటి రెండురోజుల్లో జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బందితో కలిసి కూల్చివేతలు చేపడుతామని స్పష్టం చేశారు.