ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 18: రాజకీయ విలువలు మరిచి ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుంగ బాలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్పై, ఎమ్మెల్సీ కవితపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే అరవింద్ నాలుక చీరేస్తామన్నారు. భారతదేశ అత్యున్నత చట్టసభ సభ్యుడిగా ఉండి, తన పదవికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.
బీజేపీ నుంచి ఎంపీలుగా గెలిచిన ఒక అరగుండు, ఒక బోడిగుండు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. వారిని తెలంగాణ ప్రజలు క్షమించబోరని చెప్పారు. అరవింద్ను గెలిపించినందుకు నిజామాబాద్ ప్రజలు బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్రంలో తిరుగకుండా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. అరవింద్ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్వీ, తెలంగాణ జాగృతి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మేడ్చల్, నవంబర్18(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని అఖిల భారత యాదవ మహిళా సభ మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మన్యబోయిన దుర్గామాధవి యాదవ్ అన్నా రు. వెంటనే అరవింద్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే ఎంపీ అరవింద్కు మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.