హైదరాబాద్ : ఏడేండ్ల వయసులోనే కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించిన హైదరాబాద్ అబ్బాయికి ప్రధాన మంత్రి రాష్ట్రీల బాల పురస్కార్ అవార్డు వరించింది. సోమవారం మధ్యాహ్నం వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో తేలుకుంట విరాట్ చంద్రకు ప్రధాని మోదీ ఈ అవార్డును అందజేశారు.
హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన తేలుకుంట విరాట్ చంద్ర(8) మూడో తరగతి చదువుతున్నాడు. కఠోర శిక్షణ అనంతరం గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారోను అధిరోహించి ఔరా అనిపించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా విరాట్ కిలిమంజారో పర్వతాన్ని ఎక్కడం విశేషం.
మొత్తం ఆరు విభాగాలలో(ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ,ధైర్యసాహసాలు, స్కూల్ అండ్ ఎడ్యుకేష్ కి సంబంధించిన) అసాధారణ విజయాలు సాధించిన పిల్లలకు భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును అందజేస్తోంది. బాల శక్తి పురస్కారం యొక్క వివిధ కేటగిరీల కింద ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 29 మంది పిల్లలు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రతి అవార్డు గ్రహీతకు పతకం, నగదు బహుమతి రూ. 1 లక్షతో పాటు సర్టిఫికేట్ ను అందజేస్తారు. నగదు బహుమతిని అవార్డు గ్రహీతల సంబంధిత బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు.