Hyderabad | సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): బేగంపేటలోని జైన్నగర్లో ఇద్దరు దుండగులు తుపాకీ గురిపెట్టినా.. వెరవకుండా..తల్లీకుమార్తె చూపిన ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలందుతున్నాయి. వారిద్దరి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నదని పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా నార్త్జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తల్లీకూతుళ్ల ధైర్యాన్ని అభినందిస్తూ.. వారిని సన్మానించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఖాన్పూర్కు చెందిన సుశీల్కుమార్ , ప్రేమ్ చంద్ర దోపిడీకి ప్లాన్ చేశారు. ఇందులోభాగంగా బేగంపేట జైన్నగర్లో ఓ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఆ ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకుపోయేందుకు గురువారం వచ్చారు. సుశీల్కుమార్ హెల్మెట్ ధరించగా, ప్రేమ్చంద్ర ముఖానికి మాస్క్ ధరించి.. తలకు టోపీ పెట్టుకున్నాడు. తలుపు వద్దకు వచ్చి ఇంటి యజమానురాలైన అమిత పేరు పిలుస్తూ.. ఎన్కే జైన్ పేరుతో కొరియర్ వచ్చిందంటూ చెప్పాడు. ఇంతలో పనిమనిషి ఆ కొరియర్ తీసుకునేందుకు రాగా, ప్రేమ్ చంద్ర ఇంట్లోకి చొరబడ్డాడు. కిచన్లోకి వెళ్లి పని చేసే మహిళ మెడకు కత్తిపెట్టాడు. సుశీల్ తలుపు వద్ద ఉన్నాడు. ప్రమాదాన్ని పసిగట్టిన అమిత కూతురు తలుపు వద్ద ఉన్న సుశీల్పై దాడి చేసింది.
ఆమె తల్లి అమిత అక్కడకు చేరుకొని.. తుపాకీ ఉన్నా..భయపడకుండా.. ఇద్దరు కలిసి సుశీల్ను చితకబాదారు. అతడి వద్ద ఉన్న తపంచాను లాక్కొన్నారు. తల్లీకూతుళ్ల దాడితో.. అక్కడి నుంచి సుశీల్ పరారయ్యాడు. బయట జరుగుతున్న కొట్లాటను గుర్తించకుండా లోపలే ఉండిపోయిన ప్రేమ్చంద్ర.. ఆలస్యంగా బయటకు రావడంతో అతడిపై కూడా దాడి చేసి.. స్థానికుల సహాయంతో పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అప్పటికే పారిపోయిన సుశీల్ను సైతం పట్టుకున్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి తపంచా, రబ్బరు బుల్లెట్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా అమిత కిక్ బాక్సింగ్, కరాటేలో అనుభవం ఉండటంతో భయపడకుండా దొంగలతో వీరోచితంగా పోరాడగా, ఆమె కూతురు కూడా ధైర్యసాహసాలను చూపించింది. ఇంట్లోకి ఆయుధాలతో వచ్చిన దొంగలతో పోరాడిన అమిత, ఆమె కూతురు చూపిన తెగువ అందరికీ ఆదర్శప్రాయమైందని డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు.