సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ విభాగంలో తీసుకొచ్చిన టెక్నాలజీ పరమైన సంస్కరణలు, ఇతర విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేస్తుండటంతో నగరంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్కుమార్ అన్నారు. రోడ్ సేఫ్టీపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు కిరణ్కుమార్, బన్షీశర్మ సోమవారం నగరంలో ట్రాఫిక్కు సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు సీపీ, సుప్రీంకోర్టు కమిటీకి నగరంలో ట్రాఫిక్ విభాగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి గణాంకాలతో వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడం, కారణాలు విశ్లేషించి.. ఇతర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ..సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. అంతేకాకుండా బ్లాక్ స్పాట్లు గుర్తించి, అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు కమిటీ సభ్యులు సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్తో పాటు నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి ట్రాఫిక్ నియంత్రణ ఎలా చేస్తున్నారు.. సీసీ కెమెరాలతో ట్రాఫిక్ పరిశీలన ఎలా జరగుతుంది..ఆటోమెటెడ్ సిగ్నల్ వ్యవస్థ, డేటా ఇంటిగ్రేషన్ అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.