వలస కార్మికులే టార్గెట్…
ట్రావెలింగ్ ఏజెన్సీలతో కలిసి ముఠా
గమ్యానికి చేరుస్తామంటూ దారి దోపిడీ
ఏడుగురు నిందితుల అరెస్టు
ఖైరతాబాద్, ఫిబ్రవరి 2 : వలస కార్మికులే వారి టార్గెట్. ప్రధాన బస్టాండ్లలో ఆటోలతో కాపు కాసి….కనికట్టు చేసి…..దారి దోపిడీకి పాల్పడుతారు. ప్రైవేట్ ట్రావెల్స్తో కలిసి ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఈ దాష్టికాలకు పాల్పడుతున్న నిందితులను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
నేర వివరాలను సిటీ స్పెషల్ బ్రాంచ్ విభాగం జాయింట్ సీపీ, సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ విశ్వప్రసాద్, అడిషనల్ డీసీపీ రమణారెడ్డి, ఏసీపీ వేణుగోపాల్రెడ్డి, డీఐ రాజునాయక్తో కలిసి వెల్లడించారు. మధ్యప్రదేశ్ సిలుగురికి చెందిన ముందర్ కోల్, రాజేశ్ కోల్, రహేందర్కోల్, లాల్గీకోల్, అల్హా కోల్, జగేశ్వర్, సునీల్ కేవల్, లాల్బహదూర్, సురేశ్ కోల్ గతనెల 28న దీపక్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరి.. మరుసటిరోజు ఎంజీబీఎస్ చేరుకున్నారు. బస్సులో ట్యాంక్బండ్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దిగారు.
అక్కడ ఉన్న ఇద్దరు ఆటో డ్రైవర్లు వారిని సంప్రదించారు. తాము కరీంనగర్కు వెళ్లాలని చెప్పగా, తమకు తెలిసిన ట్రావెల్స్ సంస్థలు ఉన్నాయని, అక్కడే టికెట్లు బుక్ చేసి గమ్యస్థానానికి పంపిస్తామని నమ్మబలికారు. వెంటనే వారందరినీ ఆటోలో ఎక్కించుకొని.. దోమలగూడలోని సలామ్ నమస్తే ట్రావెల్స్ సంస్థకు తీసుకెళ్లారు. అక్కడి వారి ముఖ కవళికలు అనుమానాస్పదంగా ఉండటంతో బాధితుల్లో ఒకరు కూకట్పల్లిలో నివసించే సూపర్వైజర్ డీకే శర్మకు తమ సెల్ఫోన్లో లొకేషన్ షేర్ చేశాడు.
వారి మోసాన్ని పసిగట్టినట్లు గ్రహించిన ట్రావెల్ ఆఫీస్ మేనేజర్, సిబ్బంది, వారిని తీసుకువచ్చిన ఆటోడ్రైవర్లు ఒక్కసారిగా దాడికి దిగారు. వారిపై పిడిగద్దులు కురిపించారు. సెల్ఫోన్లు, నగదు లాక్కున్నారు. అనంతరం అదే ఆటోల్లో వారిని ఆరాంఘర్ చౌరస్తాలో దింపేసి వెళ్లిపోయారు. వారిలో ఒకరి వద్ద ఫీచర్ ఫోన్ ఉండటంతో విషయాన్ని తమ సూపర్వైజర్కు వివరించగా, వెంటనే సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశారు.
వెలుగులోకి రాని దోపిడీలెన్నో….
పట్టుబడ్డ నిందితులతో పాటు మరికొందరు ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆటో స్టాండ్లు, బస్టాప్లను అడ్డాగా చేసుకొని తమ నేరాలను విస్తృతంగా సాగిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న అడ్డాలలో వీరి ముఠా అమాయకుల కోసం కాపుకాసి.. దారిదోపిడీలకు పాల్పడుతున్నట్లు తేలింది. వలసకార్మికులు, సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని టార్గెట్ చేస్తున్నారు. వారిలో పలు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలను సైతం పోలీసులు గుర్తించారు.
షాలీమార్ ట్రావెల్స్ (అఫ్జల్గంజ్), కేజీఎన్ ట్రావెల్స్ (ఉప్పల్, అఫ్జల్గంజ్), ఆశీర్వాద్, నీతా ట్రావెల్స్ (లక్డీకాపూల్), జ్యోతి ట్రావెల్స్, అబ్బా బస్, గోల్కొండ ట్రావెల్స్, సవేరా ట్రావెల్స్, సంగీతా ట్రావెల్స్ (అఫ్జల్గంజ్), రామ్ట్రావెల్స్ (మేడ్చల్ రోడ్) ఉన్నట్లు తెలిపారు. వీరితో పాటు ముఠా సభ్యులుగా ఉన్న ఆటోడ్రైవర్లు ఎండీ మోయిన్, సోహెల్ ఖాన్, షేక్ జాఫర్, షేక్ మోహిసిన్, అస్లాం, అబ్రార్, సంతు, ఫేరోజ్, అబ్బు గిర్ అలియాస్ దస్తగిర్ అలియాస్ మియాబాయ్, బాబు, రాజు, ఆజమ్, సాయి కైలాశ్, అసద్, రఫీక్, ముఖీద్, ఫహీమ్, సమీర్లు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తు తేలిందని, త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ విశ్వప్రసాద్ వివరించారు.
నిందితులు అరెస్ట్….ఆటోల సీజ్
సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి, డీఐ రాజునాయక్ నేతృత్వంలో పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఎట్టకేలకు నేరానికి పాల్పడిన యాకుత్పుర బాగ్ ఎ జహనారాకు చెందిన సలామ్ నమస్తే ట్రావెల్స్ మేనేజర్ మహ్మద్ సోహెల్ అలియాస్ సోహెల్ (32), ఫలక్నుమా జుబల్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ మోయిన్ అలియాస్ ఎండీ మోయిన్ (32), బాలాపూర్ షాహీన్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ సోహెల్ ఖాన్(37) అలియాస్ సోహెల్, చాంద్రాయణగుట్ట బండ్లగూడ, జహంగీరాబాద్కు చెందిన సయ్యద్ నదీం (27), వాణినగర్ తలాబ్కట్టాకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ జాఫర్ అలియాస్ జాఫర్ (23), ఐడియాకాలనీ హస్సన్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ షేక్ మోసిన్(26), యాకుత్పుర బడాబజార్కు చెందిన సలామ్ సమస్తే ట్రావెల్స్ యజమాని మహ్మద్ హాజీ పాషా అలియాస్ హాజీ (27)లను అరెస్టు చేశారు.నిందితుల నుంచి ఆటోలు, తస్కరించిన నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.