సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి క్షేత్ర స్థాయిలో అమలుచేస్తున్నది. దేశంలో మరే ఇతర మెట్రో నగరంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేయని విధంగా కోకాపేటలో భారీ లేఅవుట్ను నియోపోలిస్ (ఎస్ఈజెడ్-స్పెషల్ ఎకనామిక్ జోన్) పేరుతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్నది. సుమారు 529.66 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా హెచ్ఎండీఏ చేపడుతున్నది. 150, 120 అడుగుల వెడల్పుతో విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, తాగునీరు, డ్రైనేజీ లైన్లను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటికే ఔటర్ రింగు రోడ్డు నుంచి, గండిపేట-శంకర్పల్లి రహదార్ల నుంచి అనుసంధాన రోడ్లు ఉండగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోకాపేట ప్రధాన కేంద్రం నుంచి మరో లింకు రోడ్డును 100 అడుగుల వెడల్పుతో నిర్మించేందుకు హెచ్ఎండీఏ కార్యాచరణ సిద్ధం చేసింది. క్షేత్ర స్థాయిలో దీనికి సంబంధించిన సూచిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు.
నియోపోలిస్ లేఅవుట్లో ఇప్పటికే భారీ విశాలమైన రోడ్ల నిర్మాణం చివరి దశలో ఉండగా, కొత్తగా ఈ లింకు రోడ్డును కోకాపేటలోని శాంతినగర్, అల్లు రామలింగయ్య ఫాంహౌస్ మీదుగా గోల్డెన్ మైల్ లేఅవుట్ను కలుపుతూ సుమారు 2.కి.మీ పొడవుతో 100 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డును విస్తరించనున్నారు.
దీంతో హెచ్ఎండీఏ ఇప్పటికే అభివృద్ధి చేసిన గోల్డెన్ మైల్ లేఅవుట్తో కొత్తగా అభివృద్ధి చేస్తున్న నియోపోలిస్ లేఅవుట్కు 100 అడుగుల వెడల్పుతో కూడిన రహదారిని హెచ్ఎండీఏ సొంత నిధులతో నిర్మాణం చేపట్టింది. రోడ్డు విస్తరణకు సంబంధించిన సర్వేను పూర్తి చేసిన హెచ్ఎండీఏ అధికారులు ఆమార్గంలో ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేశారు. భూసేకరణ పూర్తి చేసి రోడ్డు నిర్మాణం పనులు మొదలు పెట్టనున్నారు. కోకాపేట ప్రాంతంలో భవిష్యత్తులో గణనీయంగా పెరిగే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు హెచ్ఎండీఏ లేఅవుట్ల మధ్య భారీ విశాలమైన రోడ్నెట్ వర్క్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.