సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : దేశంలోని అన్ని భాషల్లోని సాహిత్యం ఒకేచోట చేరి సాహిత్య ప్రియులకు స్వాగతం పలికాయి. సైఫాబాద్లోని విద్యారణ్య పాఠశాలలో రెండో రోజు శనివారం హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ చర్చా గోష్ఠులు, వైవిధ్యమైన అంశాలతో ఉత్సాహంగా సాగింది. పుస్తక వేడుకలో ప్రముఖ రచయితలు, కవులు, మేధావులు సందర్శించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, జర్మనీ, ఫ్రెంచ్ లాంటి అనేక భాషల్లో పుస్తకాలు కొలువుదీరాయి.
అలాంటి వారిని హీరోలుగా చూపుతున్నారు పాలగుమ్మి సాయినాథ్
స్వతంత్ర పోరాటంలో పాల్గొనని వారిని హీరోలుగా చూపుతున్నారు అని ‘ది లాస్ట్ హీరోస్ ఫూట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. సునితారెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతత్రం ఆదివాసీలు, అట్టడుగు ప్రజల పోరాటాల ఫలితమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ వారిని పరిమితమైన కోణంలోకి నెట్టివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన స్వాతంత్ర సమరయోధుల చరిత్రను వెలికి తీయాల్సిన బాధ్యత కలాలపై ఉందని చెప్పారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత రాజ్యాంగంపై కల్పనాకన్నాబిరన్, ప్రొఫెసర్ కోదండరాంలతో కలిసి ప్రముఖ రచయిత్రి ఓల్గా చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ, అపర్ణా తోటతో కలిసి సాహిత్య వేడుకలో ప్యానల్ డిస్కషన్లో పాల్గొన్నారు. అలాగే ‘ల్యాండ్-గన్స్-క్యాస్ట్-ఉమెన్: ది మెమరీస్ ఆఫ్ ఎ ల్యాప్స్డ్ రెవల్యూషనరీ’ అనే అంశంపై గీతారామస్వామి, మాడభూషి తేజస్వినితో కలిసి సాహిత్య చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
నగరానికి మణిహారాలు రాతి శిలలు..;సొసైటీ టు సేవ్ రాక్ ప్రెసిడెంట్ప్రొఫెసర్ ఫాతిమా అలీఖాన్
సంగీతవర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవ్రాక్ నినాదం సాహితీప్రియుల నుంచి పాఠశాలల విద్యార్థుల దాకా అందరినీ ఆలోచింపజేస్తున్నది. ప్రకృతిలో వెలిసిన పురాతన రాతి శిలల చిత్రాలతో ఫొటో ప్రదర్శన తిలకించేందుకు విద్యార్థులు మక్కువ చూపారు. ఈ సందర్భంగా ప్రముఖ జియాలజిస్ట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాతిశిలలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫరూక్ ఖ్వాదర్, పద్మినిపటేల్, జి.బి.ఆర్.ప్రదీప్, సుధీర్ భాన్, సాజిద్ మహ్మద్, అమిత, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీ స్టాండ్ లైక్ బనియన్ ట్రీ…
ప్రతి మానవుడూ బీ స్టాండ్ లైక్ బనియన్ ట్రీ లాగ ఉండాలంటూ పాఠశాలలో మర్రిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన పలు అంశాలు అందరినీ ఆలోచింపజేశాయి. ప్రతి జీవికి ప్రాణం పోసేది, జీవ వైవిధ్యానికి, ప్రపంచంలోని జీవజాతులన్నింటికీ మర్రిచెట్టు పట్టుగొమ్మగా నిలుస్తుందని రుజువు చేస్తూ ఏర్పాటు చేసిన పలు చిత్రాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సాహిత్య వేడుక డైరెక్టర్లు డాక్టర్ టి.విజయ్కుమార్, అమితాదేశాయ్, కిన్నెరమూర్తి ఆధ్వర్యంలో వర్క్షాప్స్తోపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. నేడు హైదరాబాద్ సాహిత్య పండుగ ముగియనున్నట్లు వారు వెల్లడించారు.