నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్కు లేక్ సిటీగా పేరుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నీటి వనరులు కబ్జా కోరల్లో నలిగిపోయాయి. కొన్ని కాలగర్భంలోనూ కలిసిపోయాయి. నాటి పాలకుల నిర్లక్ష్యానికి గురైన నగర చెరువులకు స్వరాష్ట్రంలో పునర్జీవం పోసింది తెలంగాణ సర్కారు. చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే కాదు..ప్రకృతి సోయగాలతో అందమైన పర్యాటక ప్రదేశాలుగానూ తీర్చిదిద్దుతున్నది. కుటుంబసమేతంగా సేదతీరేలా.. సౌకర్యాలు కల్పించడంతో పాటు.. చిల్డ్రన్స్ ప్లే ఏరియా.. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు.. వలస పక్షులు ఆకర్షించేలా బ్యూటిఫికేషన్..ఆనందాన్ని.. ఆహ్లాదాన్ని పంచే పూల మొక్కలు.. ఇలా సకల హంగులతో చెరువులను సుందరీకరిస్తుండటంతో సిటీ లేక్స్.. ఇప్పుడు కొత్త లుక్స్తో పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
సహజ జలవనరులైన చెరువులు, కుంటలు, వాగులను పరిరక్షించి, భావితరాలకు భద్రంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పనిచేస్తున్నది. సంస్థ పరిధిలో ఉన్న లేక్ప్రొటెక్షన్ కమిటీ పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నది. గుర్తించిన ప్రతి చెరువును పరిరక్షించడమే లక్ష్యంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ పనిచేస్తున్నది. ఇందుకోసం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న లేక్ ప్రొటెక్షన్ కమిటీ(ఎల్పీసీ)కీ ఐఏఎస్ అధికారిని కన్వీనర్గా నియమించారు.
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 7 జిల్లాల్లోనూ మళ్లీ ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా లేక్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేశారు. మొత్తంగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న జలనవరులైన చెరువులకు, కుంటలను పరిరక్షించడమే ఏకైక లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటివరకు హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 3132 చెరువులు ఉండగా, ఔటర్ రింగు రోడ్డు లోపల 533, ఔటర్ రింగు రోడ్డు బయట 2599 చెరువులు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 225 చెరువులకు సంబంధించి సర్వేలను పూర్తి చేసి, ఎఫ్టీఎల్ను నిర్ణయిస్తూ.. ఫైనల్ నోటిఫికేషన్ను జారీ చేశారు.
సహజసిద్ధంగా నీటి వనరులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చెరువుల పరిరక్షణ, అభివృద్ధి-సుందీరకరణ పనులను శరవేగంగా చేపట్టింది. తొమ్మిదేండ్ల కాలంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు, సుందరీకరణ పనుల కోసం సుమారు రూ.494 కోట్లకు పైగా ఖర్చు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని మినహాయిస్తే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో 3వేలకు పైగా చెరువులు, కుంటలు ఉన్నట్లు గుర్తించి, ఇందుకోసం లేక్ ఐడీలను ఇచ్చి జియో ట్యాగింగ్ చేశారు.
చెరువుల పరిరక్షణలో మేముసైతమంటూ.. కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రభుత్వ చర్యలకు తమ వంతుగా భాగస్వామ్యమవుతామంటూ.. చేయూతనందిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే దుర్గం చెరువును ఐటీ రహేజా కంపెనీ, ఖాజాగూడ లేక్ను ఓ ప్రైవేట్ సంస్థలు దత్తత తీసుకుని పరిరక్షణ, సుందరీకరణ పనులు చేపట్టాయి. అదేవిధంగా హెచ్ఎండీఏ పరిధిలోని కోకాపేట లేక్ను దత్తత తీసుకుంటామంటూ ఘర్ అనే సంస్థ ముందుకొచ్చింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ కింద సమీపంగా ఉన్న కోకాపేట చెరువును సుందరీకరణ, పరిరక్షణకు ముందుకొచ్చింది. ఇలా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువుల సుందరీకరణకు పలు కార్పొరేట్ సంస్థలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయి. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో గుర్తించిన వేలాది చెరువుల పరిరక్షణకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి..సుందరీకరణతో పాటు వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతూ.. చెరువులను భవిష్యత్లో చెక్కు చెదరని రీతిలో తీర్చిదిద్దుతున్నది.
చెరువు అనే పదం శాతవాహనుల కాలం నుంచే నానుడిలోకి వచ్చింది. పూర్వం కొండలు, గుట్టల నుంచి వరద నీరు వచ్చి లోతట్టుగా ఉన్న ప్రాంతంలో నిల్వ ఉండేది. చిన్న చిన్న గుంతల్లో నీరు వల్ల ఆ చుట్టుపక్కల వ్యవసాయ బావుల్లో నీరు పుష్కలంగా ఉండేది. దూరంగా ఉన్న భూముల్లో నీరు ఉండకపోయేది. తర్వాత కరువు కటకాలు వచ్చేవి. దీనిని దృష్టిలో ఉంచుకొని శాతవాహనులు నీరు నిల్వ ఉన్న స్థలాలను చెరువులుగా చేశారు. శాతవాహనుల కాలం అనంతరం కాకతీయుల కాలంలో చెరువులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చరిత్ర స్పష్టం చేస్తున్నది. గొలుసుకట్టు చెరువులను నిర్మించేందుకు కాకతీయులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆ చెరువులకు మిషన్ కాకతీయ పేరిట పూర్వకళను బీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వేలాది చెరువులను పునరుద్ధరించేందుకు ఏర్పాటు చేసిన పథకానికే మిషన్ కాకతీయగా నామకరణం చేశారు. దీని ద్వారా ఎంపిక చేసిన చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టి, ఆ చెరువుకు వచ్చే వరదనీటి కాలువలకు మరమ్మతులు చేయడంతో పాటు వాటిని మనుగడలోకి తీసుకొచ్చారు. చెరువులో ఉన్న చెట్లను తొలగించి లోతట్టును పెంచి, చెరువుకట్టలను పునరుద్ధరించి తిరిగి పూర్వకళ తెచ్చారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం..ఐదేండ్ల కాలంలో గ్రేటర్ చుట్టూ ఆక్రమణలకు గురైన పలు చెరువులు ప్రస్తుతం జలకళను సంతరించుకుంటున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 185 చెరువులు ఉన్నాయి. వాటిని పరిరక్షించి, సుందరీకరించాలని నిర్ణయించి దశల వారీగా సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే తొలి విడతలో 63 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ. 94.17 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా చెరువుల్లో మురుగు కలువకుండా ఉండటంతో పాటు సుందరీకరణ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద 19 చెరువుల అభివృద్ధికి రూ.279.78 కోట్ల నిధులకు కూడా మంజూరు చేసింది. సుందరీకరణ పనుల్లో భాగంగా గ్రీనరీ డెవలప్మెంట్ చర్యలు, చెరువు చుట్టూ ఫెన్సింగ్, ఎంట్రన్స్ ప్లాజా, లైటింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నారు. వలస పక్షులను ఆకర్షించేలా బ్యూటిఫికేషన్, పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదం, ఆనందాన్ని పంచే పూలు మొక్కలు, వాకర్స్, పర్యాటకులకు వీలుగా బెంచీలు తదితర సుందరీకరణ పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.