పదేండ్ల ప్రగతి ప్రయాణంలో హైదరాబాద్ ఐటీకి కేరాఫ్గా మారింది. ఐటీలో మేటీగా నిలిచే ప్రపంచ అత్యుత్తమ కంపెనీలన్నీ తమ అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్లోనే ప్రారంభించాయి. 2013-14లో ఐటీ ఎగుమతులు రూ. 57,255 కోట్లు ఉంటే 2022-23లో రూ. 2,41,275 కోట్లకు పెరిగింది. 9,05,715 మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు ఐటీ ఎగుమతులు 4 రెట్లు పెరిగాయి. మొత్తంగా ప్రభుత్వం ఐటీ రంగంపై చూపిన ప్రత్యేక చొరవతో హైదరాబాద్ ఐటీలో సాటిలేని నగరంగా మారిపోయింది.
– సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు దేశంలో ఐటీ అంటే బెంగళూరు పేరు వినిపించేది. ప్రస్తుతం ఐటీ అంటే హైదరాబాద్ . హైదరాబాద్ కేంద్రంగా ఐటీ రంగం ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాల కోసం వినియోగించే ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ లీజింగ్లోనూ నగరం బెంగళూరును మించింది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పనితీరు వల్లేనని ఐటీ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు 31.44 శాతం ఉండగా, దేశం నుంచి సరాసరిగా ఎగుమతుల వృద్ధిరేటు 9.36గా ఉందని తాజాగా వెల్లడైంది.
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వ పాలన, సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయా రంగాల వృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీలుగా గుర్తింపు పొందిన కంపెనీలు పదుల సంఖ్యలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఐటీ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి 5 ఏండ్లకు ఒకసారి (2016, 2021)లో ఐటీ పాలసీలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తోంది. వీటికి తోడు ఐటీ శాఖ పరిధిలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ను ఏర్పాటు చేసి 10 టెక్నాలజీలను ప్రభుత్వ కార్యకలాపాలకు సమర్థవంతంగా వినియోగిస్తోంది.
– సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తేతెలంగాణ)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2013-14 వార్షిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు ఉంటే 2022-2023లో రూ.2,41,275 కోట్లకు పెరిగింది. వృద్ధిరేటు ఏకంగా 31.44 శాతంగా నమోదైంది. 9,05,715 మందికి (2023 మార్చి నాటికి) ఉద్యోగ అవకాశాలతో పాటు ఐటీ ఎగుమతులు 4 రెట్లు పెరిగాయి. ప్రభుత్వం ఐటీ రంగంపై చూపిన ప్రత్యేక చొరవతో ప్రత్యేక రాష్ట్రంలో ఐటీ రంగం ముఖ చిత్రమే మారిపోయింది. మరోవైపు పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది. మొత్తంగా గత 9 వార్షిక సంవత్సరాల్లో రాష్ట్రంలో ఐటీ
ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.
2016లో టీ-హబ్ ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు ఇక్కడ స్టార్టప్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. అదే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీని రూపొందించింది. ఔత్సాహికుల ఆసక్తిని గుర్తించిన ప్రభుత్వం ఐటీ రంగంలోనే కాకుండా ఫార్మా, బయో, మెడికల్, అగ్రికల్చర్, ఉమెన్, సామాజిక అంశాల్లో ప్రత్యేకంగా స్టార్టప్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఇంక్యుబేటర్లనూ ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీ హబ్-1కు విశేష ఆదరణ వచ్చింది. దీంతో ప్రభుత్వం ఐటీ కారిడార్లోని రాయదుర్గంలో 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 అంతస్తులతో కూడిన భవనంలో టీ హబ్-2ను ఏర్పాటు చేసింది. టీ హబ్ ద్వారా ఇప్పటి వరకు 2వేలకు పైగా స్టార్టప్లను ప్రోత్సహించగా, రూ.1860 కోట్ల నిధులు స్టార్టప్లకు సమకూరాయి.
ఐటీ రంగంలోనే కాకుండా ఇతర రంగాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను పెంచేందుకు రాష్ట్రంలో ప్రారంభించిన టాస్ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ద్వారా 7లక్షల మందికి పైగా యువకులకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ అందించారు. ఈ శిక్షణ కేవలం ఐటీ రంగంలోనే కాకుండా లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాల్లోనూ ఉన్నారు. అత్యాధునిక టెక్నాలజీల్లో మంచి నైపుణ్యం ఉన్న వారికి హైదరాబాద్ నగరంలోని ఐటీ కంపెనీల్లోనే పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి. ప్రముఖ విద్యా సంస్థలు ఐటీ కోర్సుల్లో మెరుగైన శిక్షణనిస్తుండటంతో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారానే ఐటీ కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి పలువురు ఐటీ కోర్సులు నేర్చుకునేందుకు హైదరాబాద్ వస్తున్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు సైతం నగరంలోని ఐటీ కంపెనీల్లో పొందుతున్నారు.
సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపం ఇచ్చే నమూనా కేంద్రం టీవర్క్స్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే అతి పెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. టీ హబ్ తరహాలోనే టీ వర్క్స్లో భౌతిక ఆవిష్కరణలు చేసే ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన అత్యంత విలువైన యంత్ర పరికరాలను ఉచితంగానే ఆవిష్కర్తలకు అందుబాటులో ఉంచారు. టీ హబ్ పక్కనే విశాలమైన ప్రాంగణంలో టీవర్క్స్ను ఏర్పాటు చేయడంతో ఎంతో మంది ఔత్సాహికుల ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ హబ్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దేశంలోనే అత్యుత్తమ ఆవిష్కరణ వ్యవస్థను కలిగి, స్టార్టప్లకు స్వర్గధామంగా తెలంగాణ మారింది. టెక్నాలజీ స్టార్టప్లే కాకుండా విభిన్న రంగాలు, సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ స్టార్టప్లను ప్రోత్సహించే అనుకూల వాతావరణం ఇప్పుడు టీ హబ్లో ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇలా అన్ని చోట్ల సరికొత్త ఆలోచనలతో వచ్చే వారికి అండగా నిలిచేలా ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసి నిరంతరం సరికొత్త ఆవిష్కరణలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
టీహబ్ ప్రోత్సాహంతో స్టార్టప్ కంపెనీలుగా హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన సార్టప్లు స్కైరూట్ ఏరోస్పేస్, ధ్రువ వంటి స్టార్టప్లు అంతరిక్ష రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించాయి. అంతరిక్ష పరిశోధనల్లో దేశానికి గర్వకారణంగా నిలిచాయి. ఈ రెండు స్టార్టప్లు విజయవంతంగా వృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. వీటికి అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు వచ్చింది. విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల స్కైరూట్ ఫ్రాన్స్ దేశానికి చెందిన స్పేస్ కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియా-ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆ దేశానికి చెందిన ఎక్స్ప్లియో, కనెక్ట్ శాట్లతో స్కైరూట్ ఒప్పందం కుదుర్చుకుందని స్కైరూట్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు పవన్ చందన తెలిపారు. విక్రమ్ -1 రాకెట్ను ప్రయోగించనున్నామని, దీనికి సంబందిధించిన సన్నాహాలు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.
భౌతికంగా ఒక వస్తువును తయారు చేయాలంటే చేతితో కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాల అవసరం ఉంటుంది. ఒక్కో విభాగానికి ఒక్కో యంత్రం అవసరం ఉంటుంది. అలాంటి యంత్రాలను ఔత్సాహికులు సమకూర్చుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటి వారికి ఒకే వేదికగా టీ వర్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో లేజర్ కటింగ్ యంత్రం, మిల్లింగ్, డ్రిల్లింగ్, కటింగ్, పాటరీ, సెరామిక్, కార్పెంటరీ, 3డీ, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ఎలక్ట్రో మెకానికల్ టెస్టింగ్ యంత్రం, పీసీబీల తయారీ యంత్రం, డిజైన్ ఇంజినీరింగ్… ఇలా మొత్తం 200లకు పైగా యంత్ర పరికరాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ఖరీదైన యంత్రాలు టీవర్క్స్లో అందుబాటులో ఉంటాయి. కోట్లాది రూపాయల విలువ చేసే యంత్రాలను దేశ, విదేశాల నుంచి తెప్పించి ఈ కేంద్రంలో ప్రయోగాలకు సిద్ధంగా ఉంచారు. ఎలక్ట్రానిక్ ల్యాబ్కు సంబంధించిన యంత్ర పరికరాలను బిగించి, వాటిపై నమూనా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
దేశంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులలో 20 శాతం మంది హైదరాబాద్ నుంచే ఉన్నారు. దేశ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరును సైతం వెనక్కి నెడుతూ ఐటీ రంగంలో నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతోంది. నాస్కామ్ నివేదిక ప్రకారం గత ఏడాది దేశ వ్యాప్తంగా 4.5లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వస్తే అందులో 1.5లక్షల మంది హైదరాబాద్ నుంచే ఉన్నారు. అదే సమయంలో బెంగళూరులో 1.46లక్షల మందికే ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన సమయంలో ఐటీ ఉద్యోగులు 3.23 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం 2022-23 వార్షిక సంవత్సరం వరకు 9.05 లక్షల మంది ఉండగా.. అక్టోబర్ నాటికి సుమారు 10లక్షల మంది ఐటీ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. ఉద్యోగాలు కేవలం ఐటీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వచ్చేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుం టోంది. ఇందులో ప్రధానంగా స్టార్టప్లను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయి.