ముషీరాబాద్, నవంబర్ 28: జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లలో రెండో విడత ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నియోజకవర్గంలోని 96 పోలింగ్ కేంద్రాల్లోని 274 పోలింగ్ బూత్లలో అధికారులు ఓటరు నమోదు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టారు. బూత్ స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రత్యేక నోడల్ అధికారుల పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఓటరు జాబితాలో పేర్లు నయోదు చేసుకునేలా చర్యలు చేపట్టారు. సర్కిల్-15 డీఎంసీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలంటే సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని తెలిపారు. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు నేత శ్రీనివాస్, శ్యామ్సుందర్, సయ్యద్ అస్లాం, మాధవ్, వెంకటకమణరెడ్డి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.