మేడ్చల్, మార్చి14 (నమస్తే తెలంగాణ) : యువత ఎప్పటికప్పుడు తమలో ఉన్న నైపుణ్యతను పెంపొందించుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో రూ. 25.32 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపనతోపాటు, నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్రెడ్డితో కలిసి సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో స్టడీమెటీరియల్ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జీవితంలో స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అనే మూడు అంశాలు ప్రత్యేకమని విశదీకరించారు. మనలో ఉన్న నైపుణ్యతను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ, కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య మీద ప్రత్యేక దృష్టి సారించి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఒక ఉద్యోగానికి పదుల సంఖ్యలో పోటీ ఉంటుందని, అందుకోసమే యువతకు చేయూతనిచ్చేందుకు ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్రెడ్డి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
టీ-శాట్తో 33 లక్షల మందికి విద్య
రాష్ట్ర ప్రభుత్వం టీ-శాట్ పేరుతో ఇప్పటికే విద్య, నిపుణ ద్వారా 33 లక్షల మందికి విద్యను అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీవీలు, యూట్యూబ్ల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. శిక్షణ కేంద్రాలతో పాటు టీ-శాట్లో సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఔత్సాహికులకు ప్రోత్సాహం
ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలను యువత అందిపుంచుకోవాలని, ప్రతిభ ఉన్న ఔత్సాహికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్వయం ఉపాధితో పాటు ఇతరులకు ఉపాధి కల్పించేవారికి రుణాలు కూడా అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 19వేల పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, ఇప్పటి వరకు 13 వేల పరిశ్రమలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
మంత్రి కేటీఆర్ సూచనలు
రెండు వేల మందికి శిక్షణ ఇచ్చేలా..
పీర్జాదిగూడలో రెండు వేల మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేలా కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ ఉంటుంది. భోజనం, స్నాక్స్ సౌకర్యం కల్పించారు. స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తూ, 20 సంవత్సరాల అనుభవం ఉన్న అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ, ప్రొజెక్టర్ను కూడా ఏర్పాటు చేశారు.
ఐటి కంపెనీల రాక మంత్రి కేటీఆర్ ఘనతే:మంత్రి చామకూర మల్లారెడ్డి
రాష్ట్రంలో ప్రముఖ ఐటీ కంపెనీల ఏర్పాటు ఘనత ఐటీ శాఖ మంత్రి కేటీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. 90 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కోచింగ్ సెంటర్లో భోజన వసతి, స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతీ సుభాష్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.