ఉత్సాహంగా పాల్గొన్న నగరవాసులు, చిన్నారులు
అబిడ్స్, మార్చి 2 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు సందర్శకుల సందడి నెలకొంది. బుధవారం సందర్శకుల తాకిడి పెరిగింది. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి వ్యాపారులు విచ్చేసి తమ తమ రాష్ర్టాలకు చెందిన వస్తువులతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. సూది గుండు నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్ర్తాలు, తీరొక్క దుస్తులు, ఫర్నిచర్ లభ్యం కావడంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా నుమాయిష్ నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారిని సైతం అమ్యూజ్మెంట్ పార్క్ ఆకట్టుకుంటుంది. ప్రదర్శనను పూర్తిగా చుట్టి ముట్టి వచ్చేలా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంతో హుషారుగా నుమాయిష్ను సందర్శిసు ్తన్నారు.
కరోనా తగ్గు ముఖం పట్టడంతో..
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సందర్శకులతో సందడిగా మారింది. జనవరిలో ప్రారంభం కావలసిన నుమాయిష్ కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో మూతపడిన విషయం విదితమే. కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రారంభించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో గత నెల 26న తిరిగి ప్రారంభించారు. ప్రతి సాయంత్రం నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారికి ఆహ్లాదపు వేదికగా మారుతుంది. దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వస్తువులను కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొనుగోలు చేస్తూ తమకిష్టమైన వస్తువులను ఇండ్లకు తీసుకువెళుతున్నారు.
ఆకట్టుకుంటున్న అమ్యూజ్మెంట్ పార్క్ ..ప్రత్యేక రైలు వాహనం
నుమాయిష్కు వచ్చే సందర్శకులకు అమ్యూజ్మెంట్ పార్క్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పార్క్లో జాయింట్ వీలర్, కప్ సాసర్ తదితర గేమ్లలో ఎంజాయి చేస్తున్నారు. ఈ అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు నుమాయిష్ నిర్వాహకులు రైలును ఏర్పాటు చేయడంతో రైలు ఎక్కి ఆనందంగా విహరిస్తూ నుమాయిష్ను చుట్టుముట్టేస్తున్నారు. ఏర్పాటు చేసిన నుంచి సందర్శకుల తాకిడితో నుమాయిష్ కళకళలాడుతోంది.