పహాడీషరీఫ్, డిసెంబర్ 20 :జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలు, బస్తీల ప్రజల నీటి కష్టాలకు పూర్తిగా విముక్తి లభించనున్నది. గడప గడపకూ శుద్ధి చేసిన మంచి నీళ్లు సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ పథకంలో భాగంగా హైదరాబాద్ మహానగర మంచినీటి, సివరేజీ బోర్డు ద్వారా జల్పల్లిలో 5 లక్షలు, శ్రీరామకాలనీలో 5 లక్షలు, వాదిహుదాలో 20 లక్షలు, ఎర్రకుంటలో లక్ష, బిస్మిల్లా కాలనీలో 3 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకుల నిర్మాణం చేపట్టి, పనులు పూర్తి చేశారు. మరోవైపు పైపులైన్ పనులు 40 శాతం పూర్తి చేశారు. మంచి నీటి సరఫరా కొనసాగుతున్నది. ప్రస్తుతం పహాడీషరీఫ్, షాహీన్నగర్, ఎర్రకుంట, తయ్యబ కాలనీ, సాదత్నగర్, వాది ఏ ముస్తఫా, మినార్ కాలనీల్లో పెండింగ్లో ఉన్న పైపులైన్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 60 శాతం పైపులైన్ పనులు పూర్తయ్యాయి. మరో వైపు తయ్యబకాలనీలో 60 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో ట్యాంకు పనులు జోరందుకున్నాయి. వేసవి కాలం వచ్చే లోపే వంద శాతం పైపులైన్ పనులు పూర్తి చేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు..
మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలు, బస్తీల రహదారులు ఎత్తయిన బండరాళ్లు, సమాంతరంగా లేని ప్రదేశాలతో ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి ప్రాంతాల్లో మిషన్ భగరీథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించేందుకు అన్ని సమస్యలను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని అధికారులు సాధిస్తున్నారు. కాలనీ, బస్తీల్లో శరవేగంగా పైపులైన్ వేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని ఇంటింటికీ సరఫరా చేయడం ఎంతో గొప్ప విషయం. చాలా కాలనీల్లో మంచి నీరు సరఫరా అవుతోంది. కొన్ని కాలనీల్లో పెండింగ్లో ఉన్న పనులు జరుగుతున్నాయి. ఎన్నో ఏండ్లుగా ఉన్న నీటి సమస్య శాశ్వతంగా తీరనున్నది.
– అబ్దుల్ రవూఫ్, ఉస్మాన్నగర్, బీఆర్ఎస్ నాయకుడు
నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఇంటింటికీ నీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. ఇది గొప్ప పథకం. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో చాలా కాలంగా నీటి కష్టాలు పడ్డారు. బోర్ వాటర్ వారంలో రెండు రోజులు మాత్రమే వచ్చేవి. ఇంటికి సరిపోయే నీళ్లు కూడా వచ్చేవి కావు. కాలనీలు, బస్తీ వాసులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీళ్ల కోసం ఎదురు చూసేవాళ్లు. నీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సమస్య తీరింది. మిషన్భగీరథ రిజర్వాయర్ నిర్మాణ పనులు, పెండింగ్లో ఉన్న పైపులైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి.
– అబ్దుల్లా సాది, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్