మియాపూర్, డిసెంబర్ 20 : ట్రేడ్ నిర్వహిస్తున్న ప్రతి సంస్థను లైసెన్సు పరిధిలోనికి తీసుకురావాల్సిందేనని అధికారులు ఆదేశించారు. ట్రేడ్ కొనసాగుతూ లైసెన్సు ఇవ్వకుండా.. కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. శేరిలింగంపల్లి ఐటీ జోన్లో ట్రేడ్ లైసెన్సులపై అధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ఈ క్యాలెండర్ సంవత్సరం ముగింపునకు మరో పది రోజులే గడువు ఉండటం.. ఇంకా కోట్లాది రూపాయల లైసెన్సు ఫీజులు వసూలు చేయాల్సి ఉండటంతో.. జోనల్ స్థాయిలో దీనిపై తరచూ సమీక్షల ద్వారా వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క పెద్ద ఎత్తున వ్యాపార వాణిజ్య ఐటీ కంపెనీలు కొలువై ఉన్న శేరిలింగంపల్లి జోన్లో ట్రేడ్ లైసెన్సులు తక్కువ సంఖ్యలో ఉండటం పట్ల జోనల్ అధికారులు సర్కిళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క గడువు ముగుస్తున్నందున ఇప్పటికే ఉన్న ట్రేడ్ లైసెన్సుల నుంచి వంద శాతం ఫీజు వసూళ్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీంతో సర్కిళ్లలో సంబంధిత విభాగం అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ఇందుకోసం పరుగులు తీస్తున్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ఈ క్యాలెండర్ సంవత్సరానికి గాను ట్రేడ్ లైసెన్సుల ద్వారా రూ.45 కోట్ల ఫీజులు వసూలు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.17 కోట్ల మాత్రమే వసూళ్లయ్యాయి.
గడువులోగా ఫీజు వసూలు చేయాలి..
శేరిలింగంపల్లి జోన్లో ట్రేడ్ లైసెన్సు ఫీజుల వసూళ్లపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నాం. రోజువారీ లక్ష్యాలను సైతం విధిస్తూన్నాం. జోన్ వ్యాప్తంగా రూ.45 కోట్ల మేర ట్రేడ్ లైసెన్సు ఫీజులు వసూళ్లను చేయాల్సి ఉన్నది. ఇప్పటి వరకు రూ.17 కోట్లకు పైగా పూర్తి చేశాం. గుర్తించిన ప్రతీ ట్రేడ్ను లైసెన్సు పరిధిలోకి తీసుకురావాల్సిందే. సర్కిళ్ల వారీగా సంబంధిత విభాగాలు నిత్యం క్షేత్రస్థాయిలో లైసెన్సు ఫీజు వసూళ్లపై పర్యవేక్షణ చేపట్టాలి. లైసెన్సుదారులు సైతం సకాలంలో తమ ట్రేడ్ ఫీజులను చెల్లించాలి. గడువులోగా చెల్లించని వారికి పెద్ద మొత్తంలో అపరాధ రుసుమును విధిస్తాం.
– శంకరయ్య, జడ్సీ శేరిలింగంపల్లి జోన్