మేడ్చల్, నవంబర్23(నమస్తే తెలంగాణ)/దుండిగల్: మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్రెడ్డి అస్వస్థతకు గురై చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చేరారు. సమాచారం అందుకున్న మంత్రి ఆస్పత్రికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ప్రధాని మోదీ డౌన్ డౌన్.. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి ఇంటి నుంచి మహేందర్రెడ్డిని పరామర్శించేందుకు భార్య కల్పన రెడ్డితో కలిసి బయలుదేరారు.
పరామర్శించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎల్.రమణ వైద్యశాలను సందర్శించి మహేందర్రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభు త్వం టీఆర్ఎస్ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల్లోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి ఇంట్లో లేనప్పుడు రైడ్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ ఓడిపోవడం జీర్ణించుకోలేక టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తుందన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఆసుపత్రికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.