మేడ్చల్, నవంబర్17 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోగారంలో వంద ఎకరాలలో హెచ్ఎండీఏ లేఅవుట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ను రైతుల ఒప్పందం మేరకు పూర్తి చేశారు. రైతుల నుంచి తీసుకున్న భూమిని అభివృద్ధి చేసిన తర్వాత హెచ్ఎండీఏకు 40శాతం, రైతులకు 60 శాతం ఇచ్చే విధంగా ఒప్పందం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కీసర మండలం బోగారంలో హెచ్ఎండీఎ లేఅవుట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్లాట్ల ధరను నిర్ణయించడం, వాటికి అనుమతుల సమస్య లేకపోవడంతో హెచ్ఎండీఏ లేఅవుట్కు మంచి డిమాండ్ ఉంటుంది.
జిల్లా ఏర్పాటుతో మరింత అభివృద్ధి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఏర్పడిన నాటి నుంచి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో ఉండటంతో వివిధ జిల్లాలకు చెందిన వారు, ఇతర రాష్ర్టాల వారు ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఔటర్తో పాటు ఘట్కేసర్, మేడ్చల్లో రైల్వేస్టేషన్లు ఉండటంతో రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేదు. జిల్లాలో అత్యధిక పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో దాదాపు 2.5 లక్షల పైచిలుకు మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక గేట్వే ఐటీ పార్క్ను దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండీఏ లేఅవుట్ను బోగారంలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వంద ఎకరాలలో లేఅవుట్ ఏర్పడితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనున్నది.