సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్ : నిజాం కళాశాల గర్ల్స్ హాస్టల్ విషయంలో కొనసాగుతున్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. కొత్తగా నిర్మించిన హాస్టల్ను పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్యాదవ్, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బీమా, కాలేజీ విద్యార్థినులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ చేసిన సూచన మేరకు మరోమారు సమావేశం నిర్వహించారు. పీజీ విద్యార్థులకు ఓయూలో హాస్టల్ వసతి కల్పించడంతో తాము అక్కడి నుంచి కాలేజీకి హాజరవుతామని హామీ పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారి నిజాం కాలేజీలో యూజీ విద్యార్థినులకు హాస్టల్ వసతి సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ
మంత్రి సబితారెడ్డి ఆదేశాల ప్రకారం.. కొత్త హాస్టల్లో వసతి కోసం యూజీ సెకండియర్, థర్డ్ ఇయర్ విద్యార్థినులు దరఖాస్తులు చేసుకోవడానికి ఈనెల 19వ తేదీ వరకు గడువు విధించారు. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బీమా మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో యూజీ విద్యార్థినులు పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.