సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వ్యర్థాల నుంచి తయారు చేసే మరో విద్యుత్ (వేస్ట్ టూ ఎనర్జీ) ప్రాజెక్టును దుండిగల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ద్వారా జవహర్నగర్ డంప్ యార్డులో 20 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ దాని చుట్టుపకల పట్టణ ప్రాంతాలకు చెందిన చెత్తను జవహర్నగర్ డంప్ యార్డుకు తరలించే ప్రక్రియను సమగ్ర మున్సిపల్ ఘన పదార్థాల నిర్వహణ ప్రాజెక్టుగా పరిగణిస్తారు. ఇందులో భాగంగానే జవహర్నగర్ ప్లాంట్ -1 ద్వారా ఇప్పటికే 20 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు.
త్వరలో జవహర్నగర్-2లో 28 మెగావాట్ల ఉత్పత్తిని ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో దుండిగల్లో 14.5 మెగావాట్ల ఉత్పత్తిని వచ్చే ఫిబ్రవరి నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూడు ప్లాంట్ల ఉత్పత్తి అనంతరం యాప్రాల్ 14, బీబీనగర్లో 12, ప్యారానగర్లో 20 కలిపి మొత్తం ఆరు కేంద్రాల ద్వారా దాదాపు 108.5 మెగావాట్ల ఉత్పత్తిని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ఫర్ పాయింట్స్ (ఎస్సీటీపీ) నుంచి వ్యర్థాలను జవహర్నగర్ డంప్ యార్డుకు తరలిస్తారు.
జీహెచ్ఎంసీ ద్వారా 6500 టన్నుల పై బడి చెత్తతో పాటుగా చుట్టు పకల ఉన్న 17 మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ద్వారా ప్రతి రోజు సుమారు 600 టన్నుల చెత్తతో కలిపి మొత్తం 7 వేల టన్నుల వ్యర్థాలు జవహర్నగర్ డంప్ యార్డుకు తరలిస్తారు. ఈ వ్యర్థాలను సాంకేతికంగా సెగ్రిగెట్ చేస్తారు. జవహర్నగర్ డంప్ యార్డుతో స్థానిక ప్రజల పడుతున్న ఇబ్బందులను తగ్గించడం కోసం వ్యర్థాల నుంచి 14.5 మెగావాట్ల విద్యుత్ను దుండిగల్లో ఏర్పాటు చేయనున్నారు. దుండిగల్ లో గల ట్రిట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ సంబంధించిన స్థలంలో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ పనులు పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరి నాటికల్లా ఇక్కడి నుంచి ఉత్పత్తిని ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.