కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 2 : కూకట్పల్లి నియోజకవర్గంలో ఈనెల 6 నుంచి కొత్త ఆసరా పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జంట సర్కిళ్ల ప్రాజెక్టు విభాగం అధికారులు, సిబ్బందితో ఎమ్మెల్యే కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు కుటుంబ పెద్దలా ఆదుకోవడం జరుగుతుందని.. ప్రతినెలా ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 సం.లు నిండిన వృద్ధులందరికీ ఆసరా పింఛన్లను అందించనున్నట్లు తెలిపారు. వివిధ ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు చేసి ఎదురు చూస్తున్న వారి కలలు త్వరలోనే ఫలించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కొత్తగా 10,372 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని.. ఈనెల 6 నుంచి ప్రతి డివిజన్లో బహిరంగ సభల ద్వారా కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు.. ఆసరా గుర్తింపు కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్లు ప్రభాకర్, ఇంద్రసేన, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉన్నారు.
ఆడబిడ్డలకు పెద్దన్నలా..
పేదింట్లో ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నలా సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో 30మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనతో నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని దేశంలో ఎక్కడాలేని విధంగా ఆడబిడ్డల పెండ్లికి ప్రభుత్వం ఆర్థిక సమాయం అందిస్తుందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.
లబ్ధిదారులకు పింఛన్లు
కొత్తగా ధరఖాస్తు చేసుకున్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల 12వ తేదీన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా పెన్షన్ కార్డులను అందించనున్నట్లు కార్పొరేటర్ సబీహాబేగం తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక వార్డు కార్యాలయంలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు, సామాక్య లీడర్లతో కార్పొరేటర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. అల్లాపూర్ డివిజన్కు చెందిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అందరూ హాజరై పెన్షన్కు సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆర్పీలు ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అహ్వానించేలా సీవోలు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ఆదేశించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, వీరారెడ్డి, పార్వతమ్మ, పుష్పలత, జ్ఞానేశ్వర్, మల్లికార్జున్ పాల్గొన్నారు.