మేడ్చల్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ) ;మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే దిశగా సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. అభివృద్ధి కోసం రూ.70 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు విడుదల చేస్తూ తక్షణమే జీవో జారీ చేస్తానని స్పష్టం చేశారు. మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు రూపొందించుకోవాలని కోరారు. బుధవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆసరా పింఛన్లతో అత్త, అమ్మలకు గౌరవం పెరిగిందని ఆయన చేసిన వ్యాఖ్యకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. మరోవైపు జిల్లాకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల తరుపున మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. –
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. శివారు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న మేడ్చల్ జిల్లా మరింత అభివృద్ధికి ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో శాసన సభ్యులు అభివృద్ధి పనులు రూపొందించుకోవాలని చెప్పారు. ఈ మేరకు గురువారం నిధుల మంజూరీకి జీవో జారీ చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులకు ఇచ్చిన రూ. 5 కోట్ల నిధులే కాకుండా అదనంగా నియోజకవర్గానికి మరో రూ. 10 కోట్ల నిధులను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెంది ఉందని, హైదరాబాద్ సమీపంలో ఉన్న జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిధుల కేటాయింపుతో జిల్లా ప్రజల, శాసన సభ్యుల తరపున జిల్లా మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి జిల్లా ప్రజలకు పరిపాలన సౌలభ్యం కల్పించినట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దామోదరరావు, ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కేపీ వివేకానంద, అరెకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సురభి వాణీదేవి, జనార్దన్రెడ్డి, నవీన్కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితసబర్వాల్, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, కలెక్టర్ హరీశ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్ శ్యామ్సన్, డీఆర్వో లింగ్యానాయక్, ఆర్డీవో రవి, సీపీ స్టీఫెన్ రవీంద్ర, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండి జహంగీర్, మర్రి రాజశేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు
కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటైన సభకు జిల్లాలోని నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్న సమయంలో జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఆసరా పింఛన్లతో అత్తలకు, అమ్మలకు డిమాండ్ పెరిగిందని.. ఇది నిజమేనా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించడంతో నిజమేనని ప్రజలు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అంచనాలకుమించి ప్రజలు, కార్యకర్తలు రావడంతో టీఆర్ఎస్ శ్రేణులలో ఉత్సహం నిండింది.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో ముందంజలో ఉంది. హైదరాబాద్ సమీపంలో ఉన్న ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో పని చేస్తున్నాం. ఎన్నో అనుకూలతలు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకే ప్రత్యేక దృష్టితో జిల్లాగా ఏర్పాటు చేశాం. భవిష్యత్లో మరింత ప్రగతి పథంలో నిలిపేందుకు విశేష కృషి చేస్తున్నాం.
– సీఎం కేసీఆర్