జూబ్లీహిల్స్,ఆగస్టు16: రహ్మత్నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీదర్కు దైవ దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వారిలో రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని మహాత్మానగర్కు చెందిన వారున్నారు. బేగంపేట నుంచి సోమవారం కారులో బయలుదేరి బీదర్లోని దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్తుండగా మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో బెంగళూరు 65వ నంబర్ జాతీయ రహదారి కర్ణాటక- తెలంగాణ సరిహద్దు రోడ్డుపై ఎదురుగా వెళ్తున్న కంటైనర్ను ఓవర్టేర్ చేయబోయి వేగంగా ఢీ కొట్టడంతో వాహనంలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు మహిళలకు నిమ్స్లో, మరో మహిళకు గాంధీ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మహాత్మానగర్కు చెందిన గోగి గిరిధర్ (44), అనిత (36) తో పాటు వారి మూడేండ్ల కుమారుడు మయాంక్, దినేశ్ (23) ప్రియ (16) మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నలుగురు మహిళల్లో 60 ఏండ్ల వృద్ధురాలు సరళ గాంధీ దవాఖానలో మృత్యువుతో పోరాడుతున్నది. సరిత, రజిత, శాలిని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ప్రియ బేగంపేట్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. దినేశ్ విద్యాభ్యాసం పూర్తికావడంతో ప్రైవేట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా, బేగంపేట్ దగ్గర ఒక ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హర్ష ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.
మహాత్మానగర్లోని ఉమ్మడి కుటుంబంలో ఒకేసారి ఐదుగురు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం పార్థివ దేహాలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను సామాజిక కార్యకర్త నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నగర కార్యదర్శి భవానీ శంకర్, టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
హెడ్ కానిస్టేబుల్ అంత్యక్రియలు పూర్తి
మన్సూరాబాద్, ఆగస్టు 16: కర్ణాటకలోని బీదర్ జిల్లాలో 65వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాగోల్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ గోగి గిరిధర్ (45)తో పాటు మరో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం గోగి గిరిధర్ మృతదేహాన్ని మంగళవారం ఉదయం 6:30 గంటలకు నాగోల్, జైపురికాలనీలో ఉన్న ఇంటికి తీసుకువచ్చారు. గోగి గిరిధర్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గిరిధర్ మొగల్పుర పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి జైపురి కాలనీలో ఉంటున్నాడు.
సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం స్నేహితులతో కలిసి కర్ణాటక రాష్ట్రం గానుగాపూర్లోని దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దైవదర్శనానికి వెళ్తుండగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఇంటికి తీసుకొచ్చారు. సీసీఎస్ జాయింట్ సీపీ భూపాల్ నాగోల్కు చేరుకుని గోగి గిరిధర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఉదయం 9:30 గంటలకు గిరిధర్ మృతదేహాన్ని నాగోల్ శ్మశానవాటికలో అంత్యక్రియలను పూర్తిచేశారు.