హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): సింథటిక్ డ్రగ్స్ను తయారుచేసి విదేశాలకు సరఫరా చేస్తున్న ముఠాను భువనగిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన డ్రగ్స్, ముడి సరుకును స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన పులిచెర్ల శ్రీనివాస్రెడ్డి, నల్లగొండ జిల్లా నార్కట్పల్లి, గోపులాయపల్లికి చెందిన లెనిన్బాబు కలిసి ఉప్పల్లో కొంతకాలంగా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు.
లెనిన్బాబు డ్రగ్స్ తయారుచేస్తుండగా, శ్రీనివాస్రెడ్డి దేశ, విదేశాలకు సరఫరా చేస్తున్నాడు. సమాచారం అందుకొన్న భువనగిరి ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రాములు బృందం ఉప్పల్ ఐడీఏ కాలనీలోని స్నేహ రెసిడెన్సీపై దాడులు నిర్వహించి లెనిన్బాబు, శ్రీనివాస్రెడ్డిని అరెస్టు చేశారు. వారి నుంచి 53 గ్రాముల సింథటిక్ డ్రగ్స్, 3.6 కిలోల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటికే అనేక కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.