సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : జాతీయ చేనేత దినోత్సవం పండుగలా సాగింది. పీవీమార్గ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా జరిగిన ఈ వేడుకలను చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. చేనేత కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినా, సహజమరణం పొందినా రూ. 5 లక్షల పరిహారం 10 రోజుల్లోనే కుటుంబీకుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేత ప్రతినిధిగా, మంత్రిగా తనకు అత్యంత సంతృప్తినిచ్చిన కార్యక్రమం ఇదేనన్నారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శి, కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్, ఎల్ఐసీ ప్రతినిధి శివ నాగప్రసాద్లు నేతన్న బీమా పథకానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా రూ. 50 కోట్ల విలువైన చెక్కును ఎల్ఐసీ ప్రతినిధులకు అందజేశారు.