సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపర్చడమే లక్ష్యంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చేలా పట్టణ రవాణా నిపుణులు పలు సూచనలు, సలహాలతో నివేదికలు రూపొందిస్తూ ప్రభుత్వానికి అందజేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో పట్టణ రవాణాపై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ( ఉమ్టా) పనిచేస్తున్నది. విస్తరిస్తున్న మహానగర రవాణాకు అనుగుణంగా అవసరమైన అధ్యయనాలు చేయడంతో పాటు చేపట్టాల్సిన ప్రాజెక్టుల వివరాలను ప్రభుత్వానికి అందజేస్తున్నది. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివాసముంటున్న నగరానికి ఉత్తర, పడమర దిశలను నార్త్వెస్ట్ కారిడార్గా పరిగణిస్తూ ఈ ప్రాంతం నుంచి ఐటీ కారిడార్కు సులువుగా రాకపోకలు సాగించేలా ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాల నుంచి…
ఐటీ కారిడార్ విస్తరించి ఉన్న వెస్ట్ జోన్ (పడమర) నుంచి నార్త్ (ఉత్తరం) వైపు ఎక్కువగా నివాస ప్రాంతాలు వస్తున్నాయి. కేపీహెచ్బీ, మియాపూర్ ప్రాంతాలతో పాటు నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్, అమీన్పూర్, గుండ్లపోచంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటూ నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి నేరుగా ఐటీ కారిడార్ విస్తరించి ఉన్న మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, నానక్రాంగూడ, గచ్చిబౌలి, కోకాపేట ప్రాంతాలకు ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, ఇతర ప్రైవేటు రవాణా వ్యవస్థలు సైతం అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా మియాపూర్ చౌరస్తా నుంచి మేడ్చల్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బాచుపల్లి చౌరస్తాలో ఫ్లై ఓవర్ను నిర్మిస్తున్నారు.
కేపీహెచ్బీ నుంచి కోకాపేట వరకు…
నగరంలోనే అతి పెద్ద హౌసింగ్ బోర్డు కాలనీగా పేరున్న కేపీహెచ్బీ నుంచి ఐటీ కారిడార్తో అనుసంధానం కోసం పలు చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించగా, కొత్తగా ఎలివేటెడ్ బస్ రాపిడ్ ట్రాన్స్పోర్టు సిస్టం (ఈబీఆర్టీఎస్)ను ప్రతిపాదించారు. ప్రస్తుతం కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ నుంచి మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి వరకు సుమారు 24 కి.మీ. మేర ఆకాశ మార్గంలోనే ఎలక్ట్రిక్ బస్సులు నడిచే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది.
ఈ ప్రాజెక్టుతో పాటు కొత్తగా నివాస ప్రాంతాలు వస్తున్న నిజాంపేట, బాచుపల్లి, అమీన్పూర్, బీరంగూడ, బౌరంపేట ప్రాంతాల నుంచి సైతం ఆధునిక రవాణా వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీసుకురానున్నారు. దీనిపై పట్టణ రవాణా వ్యవస్థ నిపుణులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. త్వరలో హెచ్ఎండీఏ పరిధిలోని ఉమ్టా నార్త్వెస్ట్ కారిడార్లో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపరిచే ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నది. తద్వారా ఐటీ కారిడార్కు సులభంగా, వేగంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుందని పట్టణ రవాణా వ్యవస్థ నిపుణులు పేర్కొంటున్నారు.